CM Jagan : జగన్ కు అభ్యర్థులతో మాట్లాడే తీరిక లేదా?

అధినేత మాత్రం అభ్యర్థులకు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓటమి సాకులు వెతుక్కున్నట్లు అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : June 3, 2024 12:17 pm

Jagan

Follow us on

CM Jagan : ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధినేతలు నేరుగా అభ్యర్థులతో మాట్లాడి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కనీసం అభ్యర్థులతో మాట్లాడిన దాఖలాలు లేవు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరి.. అభ్యర్థులతో మాట్లాడారు. కూటమిగా బరిలో దిగిన 175 మంది అభ్యర్థులతో నేరుగా మాట్లాడి సూచనలు ఇచ్చారు. అటు పవన్ సైతం 21 అసెంబ్లీ అభ్యర్థులతో పాటు ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కౌంటింగ్ నాడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పురందేశ్వరి సైతం పోలింగ్ ముగిసిన మూడు రోజుల నుంచి అలెర్ట్ అయ్యారు. అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. కానీ జగన్ నుంచి ఆ తరహా ప్రయత్నం జరగలేదు.

పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. అలా వెళ్తూనే ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని.. ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడి వెళ్లిపోయారు. వాస్తవానికి అది చెప్పాల్సింది ఐపాక్ సిబ్బందికి కాదు. ఎందుకంటే ఫీల్డ్ లో సేవలు అందించేది ఐప్యాక్. వారే అధ్యయనం చేసి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ పార్టీ అభ్యర్థులతో మాట్లాడకుండా.. ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా.. విదేశాలకు వెళ్లిపోయారు జగన్. అటు నుంచి వచ్చినా.. కీలక నేతలకు అవకాశమిచ్చారే కానీ.. అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీనిపైనే వైసీపీలో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి జగన్ ప్రెస్టేషన్ కు గురైనట్లు సమాచారం. అందుకే ఎవరినీ కలిసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఒక బాధ్యతాయుతమైన మీడియా గా క్రెడిబిలిటీ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ను తప్పకుండా ప్రచురించాలి. ప్రసారం చేయాలి. కానీ సాక్షి మీడియాలో జాతీయ సర్వే సంస్థల వివరాలు వెల్లడించలేదు. ఒకటి రెండు లోకల్ ఎగ్జిట్ పోల్ సంస్థల ఫలితాలను మాత్రం తిప్పితిప్పి ప్రకటించారు. ఇవన్నీ ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ఏపీలో మిగతా పార్టీల అభ్యర్థులతో నేరుగా అధినేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ విషయానికి వచ్చేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడో తేడా కొడుతోంది అన్న మాట వినిపిస్తోంది. గెలుస్తామని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపి.. అధినేత మాత్రం అభ్యర్థులకు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓటమి సాకులు వెతుక్కున్నట్లు అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.