IPAC strategy impact on YS Jagan: దేశంలో ఐప్యాక్( I pak ) ప్యాకప్ అవుతోందా? ప్రజల నాడిని పట్టుకోలేకపోతోందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్నికల వ్యూహ బృందానికి చేదు ఫలితాలను ఇచ్చాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తొలుత ఏపీలో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ను గట్టెక్కించలేకపోయింది ఐ ప్యాక్. ఇక ఆ వ్యూహబృందం పని అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాక దాని పతనం ప్రారంభమైనట్లు స్పష్టమైంది. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది.
పూర్వం ఎంతో వైభవం..
ఒకప్పుడు ఐప్యాక్ రంగంలోకి దిగింది అంటే విజయం ఆ పార్టీ కి దక్కినట్టే. 2014లో ప్రధాని మోదీ.. తరువాత మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఐ ప్యాక్ అమ్ముల పొదిలో ఎన్నో విజయాలు ఉండేవి. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఐప్యాక్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. అటు తరువాత ఆ సంస్థలో కుమ్ములాటలు పూర్తిగా బలహీనపరిచాయి. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు ఐప్యాక్ దోహద పడింది. అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మాత్రం ఐపాక్ వ్యూహాలు పనిచేయలేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కెసిఆర్, ఇప్పుడు మమతా బెనర్జీ తో పాటు స్టాలిన్ ఇదే పరిస్థితి ఎదురయింది.
పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ సలహాలు..
తన కోసం తాను రూపొందించుకున్న వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishor) బీహార్ లో పనిచేయలేదు. కానీ ఆయన రాజకీయ పార్టీలకు అందించిన వ్యూహాలు మాత్రం పనిచేశాయి. ఏపీలో మొన్న కూటమికి సలహాలు ఇవ్వడం ద్వారా తాను అనుకున్నది సాధించగలిగారు ప్రశాంత్ కిషోర్. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఐప్యాక్ ప్యాకప్ కావడం ఖాయమని తేలిపోయింది. అంతలా నిరాశకు గురిచేసాయి ఫలితాలు. అయితే ఇదే ఐ ప్యాక్ కు నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో. మొన్నటి ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయారు కానీ ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ ను వదులుకోవడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..