YCP: వైసీపీలో పెరుగుతున్న స్వేచ్ఛ.. ముదిరితే వ్యతిరేకతే కదా?

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది వైసిపి. దేశమంతా ఏపీ వైపు చూసేలా విజయం సాధించింది. అయితే ఇప్పుడు అదే రికార్డును ఓటమితో సొంతం చేసుకుంది. దేశంలో ఏ పార్టీకి ఎదురుకాని ఓటమి వైసీపీ సొంతం చేసుకుంది.

Written By: Dharma, Updated On : June 22, 2024 11:42 am

YCP

Follow us on

YCP: వైసీపీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో ముందుకు సాగుతోంది. పార్టీతో విభేదించి బయటకు వెళ్లిపోయిన నాయకులు ఉన్నారు. కానీ పార్టీలో ఉన్నవారు జగన్ లైన్ ను దాటరు. సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి వారైనా జగన్ ఆదేశాలు పాటించాల్సిందే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలు మేరకు నడుచుకోవాల్సిందే. చివరకు ప్రెస్ మీట్ పెట్టాలన్న అనుమతి తప్పనిసరి. ఒకవేళ పెట్టినా.. పార్టీ లైన్ మేరకు మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే అది నిన్నటి వరకు. ఎప్పుడైతే పార్టీకి ఘోర పరాజయం ఎదురైందో.. అప్పటినుంచి పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఎవరికివారుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏకంగా అధినేత జగన్ కు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ చెప్పిందే వేదం అన్నట్టు సాగిన ఆ పార్టీలో ఇప్పుడు కొత్త సంస్కృతి ప్రారంభం కావడం విశేషం. పార్టీ భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకుంటున్న వేళ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది వైసిపి. దేశమంతా ఏపీ వైపు చూసేలా విజయం సాధించింది. అయితే ఇప్పుడు అదే రికార్డును ఓటమితో సొంతం చేసుకుంది. దేశంలో ఏ పార్టీకి ఎదురుకాని ఓటమి వైసీపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ తో తాము ఓడిపోయామని చెప్పుకొస్తున్నారు. జగన్ సైతం ఇదే తరహా అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ట్విట్ చేశారు. దీనిపై పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది.అయితే ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా.. ఈవీఎంలపై నెపం వేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ అనుమానం పైనే కొందరు నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జనసేన నుంచి వైసీపీలోకి ఫిరాయించిన రాపాక వరప్రసాద్ అయితే.. వైసీపీ నేతలకు కళ్ళు తెరిపించేలా ఆన్సర్ చేశారు. ఈవీఎంలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన పర్యవసానమే ఈ భారీ మెజారిటీలను చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ అయితే ఓటమిపై మరోరకంగా విశ్లేషించారు. ఈవీఎంల ద్వారా కాదని.. కొందరి నేతల నోటి దురుసు కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. తాను సైతం నోటి దురుసుతో మాట్లాడతానన్న విషయాన్ని మరిచి మరి ఈవీఎంల పప్పు లేదని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో.. నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి సమాచారం జగన్ కు చేరలేదని.. అదే పార్టీకి ఊహించని ఫలితాలు తెచ్చి పెట్టిందని విశ్లేషించారు.

ఈవీఎంలతోనే తాము ఓడిపోయామన్న జగన్ వాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు వైసిపి నేతలు. అయితే గతంలో ఎన్నడూ ఈ సాహసం వారు చేయలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా మౌనంగా ఉండేవారు. జగన్ వైఖరి పై అసంతృప్తి ఉన్న బయట పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు ముందుగా అంతటి భారీ ఓటమిని పెట్టుకొని.. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తుండడంతో అందరూ బయటకు వస్తున్నారు. అధినేత తీరును బాహటంగానే తప్పుపడుతున్నారు. ఒకవేళ జగన్ తప్పిదాలను గుర్తించకుండా.. ఇలానే ముందుకు సాగితే మాత్రం.. రానున్న రోజుల్లో జగన్ వ్యతిరేక స్వరాలు మరిన్ని ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. గతంలో జగన్ వాదనను మాత్రమే వినిపించే నేతలు.. కొద్దిరోజులుగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే ఈ స్వేచ్ఛ ముదిరితే మాత్రం జగన్ కు ఇబ్బందికరమే.