AP  Liquor sales : మూడు రోజుల్లో నే మైండ్ బ్లాక్.. భారీగా మద్యం అమ్మకాలు..  ఎంతో తెలుసా?

ఏపీలో మందుబాబులు ఎగబడుతున్నారు.గత ఐదేళ్లుగా నచ్చిన బ్రాండ్లు దొరకక ఇబ్బందులు పడ్డారు.ఇప్పుడు పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో ఎనలేని ఆసక్తి చూపుతున్నారు.రికార్డు  స్థాయిలో మద్యం విక్రయాలు చేపడుతున్నారు.

Written By: Dharma, Updated On : October 20, 2024 3:26 pm

AP  Liquor sales

Follow us on

AP  Liquor sales  :ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. లాటరీలో షాపులు దక్కించుకున్న వారు.. అదే వేగంతో దుకాణాలు ఏర్పాటు చేశారు. విక్రయాలు సైతం ప్రారంభమయ్యాయి. అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ధర విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది. కానీ అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరిగాయి.ధరతో సంబంధం లేకుండా నచ్చిన బ్రాండ్లు కొనుగోలు చేసేందుకు మందుబాబులు ఎగబడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే పాత ప్రీమియం బ్రాండ్లను.. పాత ధరలకే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా ప్రజారోగ్యానికి భంగం వాటిల్లే జే బ్రాండ్ మద్యంతో జగన్ దోచుకున్నారని ఆరోపించారు.  దీంతో మందుబాబులు కూటమి వైపు మొగ్గు చూపారు. కూటమి ఏకపక్షంగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు చెప్పిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. 3396 మద్యం దుకాణాలకు గాను.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో 1800 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో.. చాలామందికి నిరాశ ఎదురయింది. షాపులు దక్కించుకున్న వారు మాత్రం విక్రయాలు ప్రారంభించారు.
 * నష్టం తప్పదని భావించినా
 అయితే నాన్ రిఫండబుల్ రుసుముతో పాటుప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంతో నష్టం తప్పదని చాలామంది భావించారు.కానీ క్షేత్రస్థాయిలో మద్యం విక్రయాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. షాపులు ప్రారంభించిన మూడు రోజుల వ్యవధిలోనే భారీగా మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఏపీవ్యాప్తంగా 541 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 150 నుంచి 200 కోట్ల వరకు సగటున మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దసరా పండగ ముగిసింది. అయినా సరే అమ్మకాలు చూస్తే భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే మద్యం దుకాణాల్లో స్టాకుపూర్తవుతోంది. మద్యం తీసుకెళ్లేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.
 * భారీగా మద్యం విక్రయం
 ఇప్పటివరకు ఆరు లక్షల 77,511 కేసుల లిక్కర్ అమ్ముడైనట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీర్ల జోరు కూడా అధికంగా ఉంది. ఇప్పటివరకు 1,94,261 కేసుల బీర్లు అమ్ముడయ్యాయని చెబుతున్నారు. ఇక బార్లకు సంబంధించి ఈ మూడు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖ నుంచి 77 కోట్ల విలువైన అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇదే దూకుడు కొనసాగితే ఏపీ ప్రభుత్వానికి మద్యం ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టే.