YCP Party : ఆ జిల్లాలో మిగిలేది ఎవరు? ఆ ఇద్దరు మహిళా నేతలు సైతం.. జగన్ కలవరం!

వైసిపి పరిస్థితి ఏమంత బాగాలేదు.ఒకవైపు పార్టీ నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతున్నారు.అదే సమయంలో కూటమి ప్రభుత్వం గట్టిగానే ఎదురుదాడి చేస్తోంది.

Written By: Dharma, Updated On : October 28, 2024 1:47 pm

YCP Party

Follow us on

YCP Party :  గుంటూరు జిల్లా పేరు చెబితేనే జగన్ హడలెత్తిపోతున్నారు. ఆ జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. అది మొదలు గుంటూరు జిల్లాకు చెందిన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు. ఇప్పటివరకు కీలక నేతలుగా ఉన్న చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబం దాదాపు వైసీపీకి దూరమైనట్టే. ఆయన అల్లుడు, గుంటూరు పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోశయ్య జనసేనలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. వయోభారంతో బాధపడుతుండడంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన సైతం వైసీపీలో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసిపి హయాంలో టిడిపి నుంచి చేరారు ఈయన. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఎంతో నమ్మకంతో టిడిపి నుంచి వైసీపీ లోకి వస్తే ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. మంత్రిగా ఉన్న విడదల రజినీకి ఇక్కడి టిక్కెట్ ను కట్టబెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు మద్దాలి గిరి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన పార్టీని వీడారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గుంటూరు నుంచి వైసీపీలో యాక్టివ్ గా ఉన్నది ఒక్క అంబటి రాంబాబు మాత్రమే. మిగతావారు ఉన్నారంటే ఉన్నారు. అలానే అనుకోవాలి. ప్రభావం చూపగలిగే నాయకులు ఒక్కరు కూడా వైసీపీలో ఉంటారా? లేదా? అన్నది అనుమానమే. ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్ లాంటి నేతలే మిగులుతారని చర్చ నడుస్తోంది.

* సుచరిత పయనం ఎటు?
వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగారు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళ నేతలు.తొలి క్యాబినెట్లో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మేకతోటి సుచరిత. అయితే విస్తరణలో ఆమె తొలగింపు తప్పలేదు. అప్పటినుంచి తీవ్ర నిరాశతో ఉండేవారు. ఎన్నికలకు ముందు కూడా చాలా రకాల అవమానాలు ఎదురయ్యాయి ఆమెకు. అయితే ఎన్నికల్లో సైతం ఆమె సీటును మార్చారు. సొంత నియోజకవర్గానికి కాదని తాడికొండకు పంపించారు. అక్కడ ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆమె పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కూటమిలోని ఆ రెండు పార్టీల నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం పార్టీ జంప్ అవుతారని తెలుస్తోంది.

* జనసేన టచ్లోకి రజని
మరోవైపు తాజా మాజీ మంత్రి విడదల రజిని సైతం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. జగన్ వెంట నిత్యం కనిపించేవారు ఆమె. ప్రెస్ మీట్లలో సైతం తన వాయిస్ ని వినిపించేవారు. ఎందుకో ఈ మధ్య కనిపించడం మానేశారు. ముఖ్యంగా యాంకర్ శ్యామల అధికార ప్రతినిధిగా మారిన తర్వాత ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. విడదల రజిని ప్లేస్ ను ఆమె సెట్ అయిపోయారని వైసీపీలో సెటైర్లు పడుతున్నాయి. మరోవైపు విడదల రజిని జనసేన లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభం అయ్యింది. ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. రజిని పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అందుకే వైసిపి కార్యక్రమాలకు హాజరు కావడం తగ్గించేసారని కూడా టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో గుంటూరు జిల్లా అంటేనే జగన్ భయపడిపోతున్నారు. ఎంతమంది పార్టీ నేతలు మిగులుతారో తెలియని పరిస్థితి అక్కడ ఉంది.