Gudivada Amarnath: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది దూకుడు కలిగిన నేతలు ఉన్నారు. అటువంటి వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మధ్య మధ్యలో ఆయన మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన విపరీతంగా ట్రోల్స్ కు గురవుతుంటారు. అందుకే ఆయనను హై కమాండ్ నియంత్రించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మునుపటిలా గుడివాడ అమర్నాథ్ పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్ననే అధినేత విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శించారు. ఆ సమయంలో మాత్రం ఆయన జగన్ వెంట కనిపించారు. కానీ విశాఖ రాజకీయాల్లో ఆయన పెద్దగా బయటకు రావడం లేదు ఇప్పుడు. అయితే ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నం కాగా.. ఓ క్రీడలో మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపైనే ప్రచారం జరుగుతోంది.
* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు గుడివాడ అమర్నాథ్. ఆయన తాత గుడివాడ అమ్మన్న, తండ్రి గుర్నాథరావు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. కీలక పదవులు చేపట్టారు. విశాఖ ప్రాంతంలో తమకంటూ రాజకీయాలు చేశారు. అనుకోని పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీలో సేవలు అందించారు. ఆ పార్టీ నుంచి కార్పొరేటర్ గా.. తెలుగుదేశం పార్టీ పక్ష నాయకుడిగా ఉండేవారు. వైసిపి ఆవిర్భావం నుంచి మాత్రం ఆ పార్టీలో పని చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అదే అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
* గోల్ఫ్ ఆడుతూ..
తరచూ మీడియాతో మాట్లాడుతూ అడ్డంగా బుక్ అవుతుంటారు గుడివాడ అమర్నాథ్. యూట్యూబ్ ఛానల్స్ తో సైతం ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఆ సమయంలో గుడివాడ అమర్నాథ్ నోటి నుంచి వచ్చే మాటలు టోల్స్ గురవుతుంటాయి. రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు అని అన్నందుకు కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గుడ్డు మంత్రిగా ముద్రవేశాయి. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్ళలేదు అని మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ ను ప్రశ్నిస్తే అక్కడ చలి ఉంటుందని చెప్పి సోషల్ మీడియాకు గొప్ప అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు మంత్రిగా ఓడిపోవడంతో… పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఆడే గోల్ఫ్ లో బిజీగా ఉన్నారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.
