Valentine’s Day 2026: సాధారణంగా ప్రేమికుల రోజు అంటే చాలామంది పువ్వులు ఇస్తుంటారు. ఖరీదైన చాక్లెట్లను బహుమతులుగా ఇస్తుంటారు. ఇంకొందరైతే మరొక విధంగా కానుకలను ఇస్తుంటారు. అయితే మన భారతీయ ప్రేమ జంటలు తమ ధోరణి మార్చుకున్నాయి. ప్రేమికుల దినోత్సవం రోజున ఈసారి కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి.
ప్రేమికులు వాలెంటైన్స్ డే రోజున పువ్వులు ఇచ్చిపుచ్చుకుంటారు. చాక్లెట్లను కానుకలుగా ఇస్తుంటారు. కొందరైతే విందులు చేసుకుంటారు. అయితే ఈ ఏడాది భారతీయ జంటలు పూర్తిగా విభిన్నమైన ధోరణిలోకి వెళ్లిపోయారు. కానుకలు కాకుండా విహారయాత్రల బాట పట్టారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు.. విలాసం ముఖ్యమని భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటల్ రూమ్ లను బుక్ చేసుకుంటున్నారు. హోటల్లు.. ట్రావెల్ కంపెనీల సమాచారం ప్రకారం ప్రేమికుల దినోత్సవం వారాంతంలో హోటల్ గదుల బుకింగ్ ల శాతం పెరిగిపోయింది. క్లియర్ ట్రిప్ అనే సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున ముందస్తుగా హోటల్ గదులను ఖరారు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇది ఏకంగా 175 శాతం పెరిగింది. ఇదే విషయాన్ని క్లియర్ ట్రిప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మంజరి సింగల్ ధ్రువీకరించారు.
“భారతీయ జంటలు ఒకప్పటి మాదిరిగా లేవు. చాలామందిలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోయింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైంది. వారికి ఏం కావాలో నిర్ణయించుకునే స్థాయి వచ్చేసింది. కుటుంబ సభ్యుల ఆమోదం కూడా దీనికి తోడైంది. అందువల్లే చాలామంది తమకు నచ్చిన వారితో విలాసవంతమైన ప్రయాణాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. అవసరమైతే ఖరీదైన ప్రాంతాలలో బసచేస్తున్నారు. ఏం చేసినా సరే మానసిక ఆనందాన్ని కోల్పోవడం లేదు. శారీరక సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. కొత్తగా ఉండాలని అనుకుంటున్నారు. అందువల్లే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి రావాలని భావిస్తున్నారని” మంజరి పేర్కొన్నారు.
గతంలో ప్రేమలో ఉన్నప్పుడు శారీరక సుఖానికి జంటలు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జీవితం ఉన్నంతవరకు ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని కోరిక అందరిలోనూ పెరిగిపోయింది. అందువల్లే ఏ విషయంలో కూడా నేటి తరం వారు రాజీ పడడం లేదు. ఫలితంగా ఏదైనా సరే.. ఏమైనా సరే.. ఈ క్షణమే నీది.. అనుభవించు హాయిగా.. స్వర్గసుఖాల లోతుగా.. అన్నట్టుగా నేటి జంటలు వ్యవహరిస్తున్నాయి.