Kambalakunta Lakshmi Prasanna: ఆమెది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే తత్వం.ఆస్ఫూర్తితోనే బీటెక్ పూర్తి చేశారు. ప్రభుత్వ కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాను అనుకున్న లక్ష్యానికి అహోరాత్రులు శ్రమించారు. ఇంతలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. అయినా సరే ఆమె అక్కడితో ఆగలేదు. దారి పొడవునా కష్టాలను ఇష్టాలుగా మార్చుకున్నారు.పట్టుదలతో అనుకున్నది సాధించారు. డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు లక్ష్మీ ప్రసన్న. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె ఆర్డిఓ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు కు చెందిన కంబాలకుంట లక్ష్మీ ప్రసన్నది సాధారణ మధ్యతరగతి కుటుంబం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదివారు.ఇంటర్ తిరుపతిలోని చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలు బిటెక్ పూర్తి చేశారు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతరత్రా ఉద్యోగాల వైపు చూడలేదు. తనకు ప్రభుత్వ కొలువు సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ముందుగా పంచాయతీ కార్యదర్శి గా ఎంపికయ్యారు.అయినా సరే సివిల్స్ సాధించాలని లక్ష్యంతో అడుగులు వేశారు. అందుకే 2018లో నిర్వహించిన గ్రూప్ 1 లో మెయిన్స్ కు అర్హత సాధించారు.కానీ ఆమెకు తృటిలో అవకాశం చేజారింది.అయినా సరే నిరాశ చెందలేదు. తొలి ప్రయత్నంలో జరిగిన లోపాలను అధిగమించి గమ్యం వైపు అడుగులు వేశారు.
* రాష్ట్రస్థాయిలో థర్డ్ ర్యాంకర్
2023లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు కూడా రాశారు. రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. మంగళగిరిలోని హెచ్ఆర్డీఏలో శిక్షణ పొందుతున్నారు. ఆమె శిక్షణ అక్టోబర్ 4తో పూర్తి కానుంది.ఈ నేపథ్యంలో ఆమెకు ఒంగోలు ఆర్డీవో గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. దీనిపై ఆమె అభినందనలు అందుకుంటుంది. లక్ష్మీ ప్రసన్న భర్త చంద్రదీప్ అనంతపురం జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు.
* ఆర్డీవో గా బాధ్యతలు
ఆర్డీవో గా ఎంపికైన తొలిసారిగానే ప్రతిష్టాత్మకమైన ఒంగోలు జిల్లాలో పోస్టింగ్ లభించడం విశేషం. ఆమె త్వరలో ఒంగోలు ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.కష్టపడి చదివి అనుకున్నది సాధించారు.జీవితంలో ఉన్నత స్థానంలో నిలిచారు. ఈ యువ డిప్యూటీ కలెక్టర్ మరి అందరితో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.