Free Gas: ఎన్నికల హామీ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టునుంది. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.ముఖ్యంగా మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 850 రూపాయల వరకు ఉంది. మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఏడాదికి ఒక్కో కుటుంబానికి 2500 రూపాయల లబ్ధి చేకూరనుంది.అందుకే మహిళలు ఈ పథకం పై ఎనలేని ఆసక్తి కనబరిచారు.కూటమి అధికారంలోకి రావడంతో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూశారు.అయితే దీపావళి నుంచి అమలు చేస్తామని ముందుగానే ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అర్హత,దరఖాస్తు, మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈనెల 24 నుంచి బుక్ చేసుకున్న వినియోగదారులకు ఆన్లైన్ విధానంలో ఉచిత గ్యాస్ పథకం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాలో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని నిర్ణయించారు.
* రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర 870 రూపాయలుగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851 గా ఉంది. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై 2684 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ ఐదేళ్లకు 13,423 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
* పేదరికమే ప్రామాణికంగా
అయితే కేవలం పేదరికం అనే ప్రాతిపదికగానే ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతి నెల రేషన్ కార్డు ద్వారా నిత్యవసరాలు పొందుతున్న వారు, స్థిర నివాసం ఉన్నవారికి అర్హులుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా దీపావళి నాడు పండుగ వాతావరణం లో ఈ పథకం ప్రారంభం కానుంది.మొత్తానికి అయితే ఎన్నికల పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నమాట.