Kiran Kumar Reddy Rajya Sabha: ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కనీసం మీడియా ముందుకు కూడా ఆయన రావడం లేదు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పొత్తులో భాగంగా బిజెపి తరఫున పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పలేదు. అప్పటినుంచి అప్పుడప్పుడు కనిపిస్తున్నారే తప్ప.. బయటకు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది లేదు. బిజెపి కార్యక్రమాలకు సైతం ఆయన హాజరు కావడం లేదు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ పదవి కోసం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపికి పదవి ఇస్తే ఆయనకే అని తెలుస్తోంది. కానీ మధ్యలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ నుంచి ఆయనకు రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సైతం ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక నేపథ్యం..
చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన అకాల మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1994లో ఓడిపోయారు. 1999, 2004, 2009లో గెలిచారు కిరణ్ కుమార్ రెడ్డి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ గా అవకాశం కల్పించారు రాజశేఖర్ రెడ్డి. 2009లో మాత్రం అసెంబ్లీ స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ హై కమాండ్.. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే రాష్ట్ర విభజన ఒకవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. ప్రజలు ఆదరించకపోయేసరికి తిరిగి కాంగ్రెస్ లోకి చేరారు. అక్కడ నుంచి బిజెపిలోకి వచ్చారు.
ఆ హామీతో..
రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువ. ప్రధానంగా రాజంపేట పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీకి అస్సలు చిక్కడం లేదు. అందుకే పొత్తులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు చంద్రబాబు. అయితే అది ఓడిపోయే సీటు అని తెలిసి ఏ నేత కూడా ముందుకు రాలేదు. అటువంటి చోట కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు చంద్రబాబుతో రాజకీయంగా విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి.. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు కిరణ్ ప్రయత్నాలకు చంద్రబాబు సాయం కూడా తోడవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజ్యసభకు ఈ మాజీ ముఖ్యమంత్రికి లైన్ క్లియర్ అయినట్టే..