TDP Mahanadu History: తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటిది మహానాడు. అయితే ఈ వేడుకను ప్రారంభించింది మాత్రం నందమూరి తారక రామారావు. హైదరాబాదులో 1982లో పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్. అలా ప్రకటించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. పార్టీ ప్రకటన హైదరాబాదులో చేసిన సమయంలోనే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడు ను జరుపుకుంటామని ప్రకటించారు. అయితే ఈ మహానాడు అనేది ఒక కార్యక్రమమా? పండుగ? అనేది తెలియలేదు పార్టీ శ్రేణులకు. అలాగని నందమూరి తారక రామారావును ప్రశ్నించే ధైర్యము ఎవరికీ లేదు. అయితే తొలిసారిగా గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మున్సిపల్ మైదానంలో నిర్వహించిన మహానాడు నభూతో న భవిష్యత్ అన్నట్టు సాగింది. తెలుగుదేశం పార్టీ గమనాన్ని మార్చింది. ఆ పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసింది. ఆ మహానాడులో అన్ని ప్రత్యేకమే. రాష్ట్రానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ.. పార్టీ అభివృద్ధి.. పార్టీ శ్రేణులకు అతిధి మర్యాదలు.. ఇలా మహానాడులో అన్ని ప్రత్యేకమే.
* అందరి దృష్టి ఎన్టీఆర్ వైపే..
కాంగ్రెస్ పార్టీ కోటను బద్దలు కొట్టింది తెలుగుదేశం. పార్టీని ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే విజయాన్ని అందుకున్నారు నందమూరి తారకరామారావు. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడదియగలిగారు. ప్రాంతీయ పార్టీలకు ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దారు. అయితే ఏ వ్యక్తికైనా.. వ్యవస్థ కైనా క్రమశిక్షణ అవసరం. వ్యూహం అత్యంత కీలకం. భవిష్యత్ కార్యాచరణ అనేది అత్యంత ఆవశ్యం. దానిని తెలుగుదేశం పార్టీకి మహానాడు ద్వారా పరిచయం చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు రోజులపాటు మహానాడు వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా మార్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడు నిర్వహించాలని శాశ్వత తీర్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఒకే వేదికపై తెచ్చేందుకు ఈ మహానాడు అనేది గొప్ప ఆయుధంగా మారింది తెలుగుదేశం పార్టీకి.
* అతిరథ మహారధులు హాజరు..
గెలుపు బాటతో జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగింది ఆ సమయంలో. 1984లో గుంటూరులో తొలి మహానాడు జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మున్సిపల్ గ్రౌండ్లో మహానాడు నిర్వహణ అనేది ఒక ప్రత్యేకంగా నిలిచింది. చివరి రోజు టిడిపి శ్రేణులతో సాగిన భారీ ఊరేగింపు అనేది తెలుగుదేశం పార్టీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. నాడు దేశవ్యాప్తంగా అతిరథ మహారధులు మహానాడుకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి అది పండుగ అయినా జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకులంతా క్యూ కట్టారు. అప్పట్లో జాతీయస్థాయిలో అగ్ర నేతలుగా ఉన్న ఎంజి రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావ్, ఫరూక్ అబ్దుల్లా, హెచ్డి బహుగుణ, చండ్ర రాజేశ్వరరావు, ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరద్ పవర్, ఉన్ని కృష్ణన్, మేనకా గాంధీ తదితరులు హాజరయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులంతా తొలి మహానాడుకు హాజరయ్యారు అన్నమాట.
* పసందైన వంటకాలతో..
ఎన్టీఆర్ భోజనప్రియలు. అందుకే తన పుట్టినరోజు నాడు నిర్వహిస్తున్న మహానాడుకు విచ్చేసి టిడిపి శ్రేణులకు పసందైన ఆహారాన్ని అందించడం ఆనవాయితీగా చేశారు. అదే ఆనవాయితీని కొనసాగించారు చంద్రబాబు. మహానాడు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆహార మెనూ. పసందైన ఆంధ్ర వంటకాలతో.. మూడు ప్రాంతాల్లో ప్రముఖమైన ఆహారంతో.. మహానాడుకు హాజరయ్యే వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టడం అనేది ఒక సంప్రదాయం. ప్రారంభ మహానాడులో టిడిపి నేతలు బస చేసేందుకు కుటీరాలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో మహానాడు ఏ నగరంలో నిర్వహిస్తే సమీపంలో హోటల్లు, ఫామ్ హౌస్ లతో టిడిపి శ్రేణులు నిండిపోయేవారు. అయితే ఈ ఏడాది ఖర్చు తగ్గించుకునేందుకు వీలుగా.. ప్రధాని సూచనల మేరకు హైబ్రిడ్ విధానంలో మహానాడుకు సిద్ధపడింది టిడిపి నాయకత్వం.
