Chandrababu Naidu Karana Balaram: మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓడిపోయింది. చాలామంది సీనియర్లు సైతం మట్టికరించారు. అయితే కొందరు పార్టీలు ఉండలేక గుడ్ బై చెప్పారు. కూటమిలో అవకాశాల కోసం కొందరు.. కేసుల పరంగా ఇబ్బందులు రాకూడదని మరికొందరు.. వ్యాపార వాణిజ్య అవకాశాల కోసం ఇంకొందరు.. ఇలా చాలామంది పార్టీ మారారు. అయితే ఇప్పటికీ కొంతమంది నేతలకు అవకాశం చిక్కలేదు కూటమి పార్టీల్లో చేరేందుకు. అటువంటి వారిలో సీనియర్ నేత కరణం బలరాం. గత రెండేళ్లలో టిడిపిలో చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఏదీ కూడా వర్కౌట్ కావడం లేదు. అయితే మాత్రం కరణం బలరాం విషయంలో చంద్రబాబు కొంత సానుకూలంగా ఉన్నారన్న టాక్ ఉంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు డోర్స్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.
సీనియర్ మోస్ట్ లీడర్..
ఉమ్మడి ప్రకాశం( Prakasam ) జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ కరణం బలరాం. ఇందిరాగాంధీ పర్యటనలో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా అప్పట్లో కరణం బలరాం అడ్డగించారు. అలా ఇందిరాగాంధీకి దగ్గరయ్యారు. అందుకే 1978లో ఆయనకు ఇందిరా కాంగ్రెస్ తరపున అసెంబ్లీ టికెట్ వచ్చింది. అలా తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీకుడు కూడా. 1983లో ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2019 వరకు ఆ పార్టీని విడిచిపెట్టలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒత్తిడి చేయడంతో ఆయన పార్టీ మారక తప్పులేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున తన కుమారుడు వెంకటేష్ బరిలో దించిన ఫలితం లేకపోయింది. అందుకే ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకుంటారని తెలుస్తోంది. కానీ ఆయనను తీసుకునేందుకు టిడిపి నాయకులతో పాటు క్యాడర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిరకాలం ప్రత్యర్ధులుగా..
సుదీర్ఘకాలం అద్దంకి నుంచి రాజకీయాలు చేశారు కరణం బలరాం. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో బలమైన నాయకుడిగా ఉండేవారు. అయితే సమీకరణల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాలేదు. అద్దంకిలో గొట్టిపాటి ఫ్యామిలీతో కరణం బలరాం కు రాజకీయ వైరం ఉంది. అయితే అదే అద్దంకి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు గొట్టిపాటి రవికుమార్. తొలుత కాంగ్రెస్.. తరువాత వైయస్సార్ కాంగ్రెస్.. అటు తరువాత టిడిపిలో కొనసాగుతున్నారు. 2014లో ఇదే కారణం ఓడించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా.. అయితే అక్కడకు కొన్ని రోజులకే గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో రవికుమార్ కు టికెట్ ఇవ్వాల్సి రావడంతో కరణం బలరామును చీరాలకు పంపించారు. అయితే అద్దంకిలో గొట్టిపాటి.. చీరాలలో కరణం బలరాం గెలిచారు. కానీ వైసీపీలోకి వెళ్లిపోయారు కరణం. దీంతో టిడిపిలో ఉన్న గొట్టిపాటి పై ఎన్ని రకాల ప్రలోభాలకు గురిచేసిన ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2024లో గెలిచేసరికి రవికుమార్ కు మంత్రిగా చాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అయితే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం సామాజిక వర్గం ఒకటే. అందుకే బలరాం ఎంట్రీ ఇస్తే తనకు కష్టమని గొట్టిపాటి రవికుమార్ కు తెలుసు. అందుకే ఆయన బలంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కరణం బలరాం టిడిపిలో ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయినట్టే.
