DSC 2025 Controversy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ప్రస్టేషన్లో ఉన్నారు. ఎప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుదామా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అపరిపక్వత మాటలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీ 2025 పై కూడా ఇదే మాదిరిగా విషప్రచారం చేస్తున్నారు. ఎంతలా అంటే పేకాట ఆడే వారికి సైతం ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారనేదాకా. వారి పరిస్థితిని చూసి నవ్వాలో.. ఏడవాలో కూడా తెలియడం లేదు. బ్రిడ్జ్ అనే క్రీడాంశాన్ని తీసుకొని.. క్లబ్బుల్లో ఆడే పేకాట అని భ్రమించారు. దానినే ప్రచారం చేసి నవ్వుల పాలయ్యారు. ఎంతలా అంటే ప్రభుత్వంపై కౌంటర్ అటాక్ చేసే మాజీ మంత్రి పేర్ని నాని కూడా అది పేకాట అని తేల్చేశారు. అడ్డంగా బుక్కయ్యారు.
* అంతర్జాతీయంగా గుర్తింపు..
అంతర్జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ చెస్ మాదిరిగా మేధో సంపత్తితో కూడిన బ్రిడ్జ్ అనే క్రీడను గుర్తించింది. అన్ని దేశాలకు ఈ క్రీడల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మన దేశం కూడా ఆ క్రీడాంశాన్ని జత చేసింది. క్రీడా కోట కింద భర్తీ చేసే పోస్టుల విషయంలో ఈ క్రీడను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించారు. అలా ఆ జాబితాలో 4వ క్రీడగా బ్రిడ్జ్ క్రీడను చేర్చారు. వైసీపీ నేతలు ఇవేవీ గుర్తించకుండా అది పేకాటగా తేల్చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. బ్రిడ్జ్ క్రీడాంశం పేకాట కాదని.. అది మేధో సంపత్తితో కూడుకున్న క్రీడ అని తేల్చింది. అసలు బ్రిడ్జ్ కోటా కింద ఏ ఒక్కరికి ఉపాధ్యాయ పోస్టు మంజూరు చేయలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నెటిజెన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
* వైసిపి ఆందోళనలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ 2025 పై ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. డీఎస్సీ ప్రశ్న పత్రం లీక్ చేశారని.. అవకతవకలు జరిగాయని.. నియామకాల్లో అడ్డగోలుగా వ్యవహరించారని.. వెబ్సైట్లో వివరాలను డిలీట్ చేశారని ఏవేవో ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. కేవలం డిఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయ మైలేజ్ పొందాలన్నది వారి ఆలోచన. ఉద్యోగాలు పొందిన 16 వేల కుటుంబాలు అయితే.. డీఎస్సీ పరీక్ష రాసిన వారు ఆరు లక్షల మందికి పైగా. అందుకే వారిలో గందరగోళం సృష్టించి పొలిటికల్ మైలేజీ పొందాలన్నది వైసిపి ఆలోచన. డీఎస్సీ 2025 పై క్రెడిట్ దక్కకుండా చేసేందుకు టిడిపి పై ఆడుతున్న గేమ్ గా తెలుస్తోంది.
