YS Jagan Mohan: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆ దూకుడుకు బ్రేక్ వేసి పూర్వ వైభవం సాధించాలని జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నారు. అందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా జారవిడుచుకోవడం లేదు. జగన్ దూకుడు పెంచుతున్న తరుణంలో మళ్లీ పాత కేసుల మాట వినిపిస్తోంది. గత 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. ఆయనపై పాత కేసులు అలానే ఉన్నాయి. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో సఖ్యతగా మెలుగుతున్నారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. బిజెపి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహకారం అందిస్తోంది అనేది బహిరంగ రహస్యమే. జగన్ ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కానీ కేంద్ర బీజేపీని అస్సలు ఏమీ అనరు. అందుకు ప్రధాన కారణం ఆయనపై ఉన్న కేసుల భయమే. తనపై కేసులు ఉన్నాయని.. కేంద్రం కన్నెర్ర చేస్తే జరిగే పరిణామాలు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి బిజెపి విషయంలో మౌనంగా ఉన్నారు. బిజెపి సైతం ఆయన విషయంలో చూసి చూడనట్టుగా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానినే హైలెట్ చేస్తోంది. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఒక న్యాయం? జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా? అంటూ ప్రశ్నిస్తోంది.
* తీవ్రమైన అభియోగాలు..
ఈ రాష్ట్రానికి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు రాజశేఖర్ రెడ్డి. 2004లో అధికారంలోకి వచ్చి 2009 వరకు కొనసాగారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. కంపెనీలతో క్విడ్ ప్రోకో ఒప్పందాలను చేసుకున్నారు అనేది ప్రధాన అభియోగం. భూములు, మైనింగ్ లీజులు, అడ్డగోలు అనుమతుల ద్వారా రాజశేఖర్ రెడ్డి హయాంలో లబ్ధి పొందిన సంస్థలు.. ప్రతిఫలంగా జగన్ కంపెనీలో వేలకోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయని సిపిఐ తేల్చింది. ఈ వ్యవహారంలో జగన్ దురాశకు సహకరించిన ఆరోపణలపై అప్పట్లో ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్ అధికారులపై సైతం కేసులు నమోదయ్యాయి. జగన్ పై సిబిఐ దాఖలు చేసిన 11 చార్ట్ సీట్లలో.. 43 వేల కోట్ల రూపాయల అక్రమల లావాదేవీలు జరిగినట్లు తేల్చింది. వాటి ఆధారంగా ఈడి నమోదు చేసిన మరో ఆరు మనీలాండరింగ్ కేసులు సైతం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 2012లో అరెస్టయ్యారు. 16 నెలలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఈ కేసులు నిరూపితమై జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా తేలితే మాత్రం పదహారేళ్లకు పైగా జైలుకే అంకితం అయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో సఖ్యత పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపి వైపే ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
* బిజెపిని కార్నర్ చేయాలని..
ఏపీలో రాజకీయాలు మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం గా ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో సైతం కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన లాబీయింగ్ తో తన కేసుల విషయంలో ఎటువంటి కదలిక లేకుండా బిజెపితో సంధి చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కేంద్ర బిజెపి సహకరిస్తోందని ఆరోపించారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించింది సిబిఐ. ఆమెకు శిక్ష పడే వరకు సిబిఐ ఉడుం పట్టు పట్టింది. ఆ స్థాయిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో లేదు అనేది చింతా మోహన్ అభిప్రాయం. ఈ అంశాన్ని హైలెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మున్ముందు జగన్మోహన్ రెడ్డి కేసులను అడ్డం పెట్టుకుని బిజెపిని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
