LoKesh Padayatra : లోకేష్ పాదయాత్రలో సీఎం జగన్ ఫ్లెక్సీల కలకలం

'హూ కిల్డ్ బాబాయ్' అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులను లోకేశ్ పాదయాత్రలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో.. వివేకా డెడ్ బాడీతో పాటు సీఎం జగన్,  అవినాశ్ ఫొటోలను వాటిలో ప్రింట్ చేశారు.

Written By: Dharma, Updated On : June 2, 2023 12:08 pm
Follow us on

LoKesh Padayatra : లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే మూడు జిల్లాలను పూర్తిచేసుకుంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో అందరి చూపు కడప వైపే ఉంది. అందుకు తగ్గట్టుగా కొత్త సంచలనాలకు యువగళం పాదయాత్ర వేదిక అవుతోంది. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య ఉదంతం హైలెట్ అవుతోంది. లోకేష్ తో పాటు పాదయాత్రలో నడుస్తున్న వారి చేతిలో ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మొన్న ఆ మధ్యన కడప జిల్లాలో అడుగుపెట్టిన లోకేష్ పాదయాత్రకు కొంచెం విరామమిచ్చారు. మహానాడుకు హాజరయ్యారు. నాలుగు రోజుల గ్యాప్ తరువాత మళ్లీ పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా కావడం, వైసీపీకి పట్టున్న ప్రాంతం కావడంతో పాదయాత్రపై కొద్దిపాటి అనుమానాలున్నాయి. ఈ తరుణంలో టీడీపీ నేతలు కొత్త ఆలోచన తెరపైకి తెచ్చారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే కావాల్సిన మైలేజ్ వస్తుందని భావించారు. కొత్త ప్రచారానికి తెర తీశారు. : ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులను లోకేశ్ పాదయాత్రలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో.. వివేకా డెడ్ బాడీతో పాటు సీఎం జగన్,  అవినాశ్ ఫొటోలను వాటిలో ప్రింట్ చేశారు.

నిన్న మొన్నటి వరకూ సాదాసీదాగా సాగిన పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శించడం కొత్త ఊపు తెచ్చిపెట్టింది. ప్లకార్డులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. పాదయాత్రకు భారీ మైలేజ్ తీసుకొచ్చేవిగా ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. సంచలన అంశాలే లోకేశ్ పాదయాత్రకు ప్రాణ వాయువు అన్నట్లుగా పరిస్థితి మారిందన్న మాట వైసీపీ వర్గాల నోటి నుంచి వస్తోంది. రాజకీయ స్టంట్ గా వైసీపీ భావిస్తోంది. తమను కవ్వించటానికే లోకేశ్ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నట్లుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. లోకేశ్ ఉచ్చులో పడి..ఏ మాత్రం స్పందించినా.. నష్టం తమకే వాటిల్లుతుందని చెబుతున్నారు. పాదయాత్రకు మైలేజీ ఇచ్చిన వారవుతామంటున్నారు.అందుకే ఆ జోలికి వెళ్లవద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.