CM Chandrababu: ముఖ్యమంత్రి పర్యటన అంటేనే ఒక హడావిడి నడిచేది. పరదాలు కనిపించేవి. పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడేది. రహదారులు ధ్వంసం అయ్యేవి. ఏకంగా డివైడర్లను తొలగించేవారు.. గత ఐదేళ్లుగా ఇదే తరహా చిత్రాలు చాలా చూశాం. జగన్ జిల్లాల పర్యటనకు వస్తే ప్రజలు బెంబేలెత్తిపోయేవారు. ఆంక్షలు కష్టపడేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. సామాన్యులకు సైతం ఇబ్బంది కలిగించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రుల పర్యటనలో సైతం ఆర్భాటాలు వద్దని సూచించారు. ముఖ్యంగా ఇంకా సీఎం గా బాధ్యతలు స్వీకరించక మునుపే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. తన పర్యటనలో సామాన్యులకు ట్రాఫిక్ ఇక్కట్లు గురించి చేయవద్దని సూచించారు. సీఎం చంద్రబాబు ఒకసారి తిరుపతి పర్యటనకు వెళ్లారు. వెంట మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. అక్కడ పోలీస్ సిబ్బంది పరదాలు కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇటువంటి సంస్కృతి మంచిది కాదని కూడా తేల్చి చెప్పారు. విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ చోట రెడ్ కార్పెట్ పరచడం పై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేనేమీ రాజుగా రాలేదు. ప్రజలకు సేవకుడిగా వచ్చాను అంటూ చెప్పడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.తాజాగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సైతం చంద్రబాబు ఆశ్చర్యపరిచారు.
* హంగు ఆర్భాటం లేకుండా
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చంద్రబాబులో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. గత ఐదేళ్లలో వెలుగు చూసిన వైఫల్యాలను అధిగమించాలన్న భావన వ్యక్తం అయింది. ముఖ్యంగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సభలు సమావేశాల పేరిట ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అధికారులతో సమీక్షలు కూడా జరపవద్దని ఆదేశించారు. రహదారుల్లో సభలు, జంక్షన్లో మీటింగ్లు పెట్టవద్దని కూడా సూచించారు. అయితే ఇవన్నీ వైసిపి హయాంలో నిత్య కృత్యంగా జరిగినవే.
* ప్రజలతో మమేకం
సామాన్యులను కలవడంలో కూడా చంద్రబాబు ఒక రకమైన ఫార్ములాను అనుసరిస్తున్నారు. సీఎం రిలీఫ్ పంపిణీ, ప్రజా దర్బార్ నిర్వహణ వంటి వాటితో ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి.. పార్టీ శ్రేణుల నుంచి వినతలు స్వీకరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మొన్న ఆ మధ్యన సచివాలయానికి వెళ్తున్న చంద్రబాబు.. తన కాన్వాయ్ ని ఆపిమరి ప్రజల నుంచి వినతులు స్వీకరించడం విశేషం. తాజాగా విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన కూర్చున్న కూర్చిపై తెల్లటి వస్త్రాన్ని కప్పి ప్రత్యేకత చాటుకున్నారు పోలీస్ అధికారులు. దీనిని గమనించిన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తెల్లటి వస్త్రాన్ని తొలగించాలని ఆదేశించారు. ఈ ఘటనతో చంద్రబాబు సింప్లిసిటీ మరోసారి వెలుగులోకి వచ్చింది.