Chiranjeevi Rajya Sabha: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి 20 నెలల పాలన పూర్తి చేసుకుంది. ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే టిడిపి శ్రేణులు గట్టిగానే ఢీకొడుతున్నాయి. వారితో పోల్చుకుంటే జనసేన నేతలు స్పందించడం లేదు. దీనిపైనే చర్చ నడుస్తుండగా పార్టీ శ్రేణులకు గట్టి సంకేతాలు పంపారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య కీలక రాజకీయ చర్చలు జరిగాయి. లడ్డూ వివాదం నేపథ్యంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో అనుసరించాల్సిన అంశాలపై వారిద్దరి మధ్య చర్చ సాగింది. సహజంగానే ఇద్దరు నేతల ఏకాంత భేటీ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి అయి ఉంటుంది. మరోవైపు ఇటీవల పవన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో ఇద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఆ వివాదం పై చర్చ..
తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి వాడిన నెయ్యిలో వైసిపి హయాంలో జంతు కొవ్వు కలిసిందన్నది ప్రధాన ఆరోపణ. సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం గత కొద్ది నెలలుగా విచారణ చేపట్టింది. ఇటీవల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు సిబిఐ ల్యాబ్ నిర్ధారణ అంటూ ఒక విషయం బయటపడింది. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదన్నది ఒక వాదన. వాడినది మాత్రం ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి కాదని.. కొన్ని రసాయనాల మిశ్రమాలతో తయారు చేసింది అంటూ మరో వాదన. ఈ విషయంలో అధికార విపక్షాల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. దానికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాప ప్రక్షాళన యాత్ర చేపట్టింది. అందులో భాగంగా మాజీమంత్రి అంబటి రాంబాబును టిడిపి శ్రేణులు అడ్డగించాయి. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్టు జరిగింది. ఈరోజు అంబటి కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అయితే ఈ ఎపిసోడ్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఢిల్లీకి అందుకే?
అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. అయితే హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడం మాత్రం కొత్త చర్చకు దారితీసింది. రాజ్యసభ పదవి కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది జూన్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని.. టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. గతంలో నాలుగు రాజ్యసభ పదవులకు గాను.. బిజెపి, టిడిపి రెండు పదవులు చొప్పున తీసుకున్నాయి. జనసేనకు రాజ్యసభలో ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి తమకు చాన్స్ ఇవ్వాలని కోరేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్లు ఒక ప్రచారం అయితే మాత్రం జరిగింది.
* కీలక భేటీ..
అయితే ఈరోజు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ రాజ్యసభ పదవుల కోసమేనన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఒక రాజ్యసభ పదవి ఖాయమని తెలుస్తోంది. ప్రధానంగా లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి( megastar Chiranjeevi) పేరు తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపితే జరిగే లాభనష్టాలు గురించి వారిద్దరూ చర్చించుకున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. గతంలో కూడా చిరంజీవి విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. వైసిపి కూడా చిరంజీవిని రాజ్యసభకు ప్రమోట్ చేయాలని ప్రయత్నించినట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి పవన్ చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే రాజకీయాలకు దూరంగా.. సినిమాల్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. అందుకే ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలి.