Megastar Chiranjeevi : చిరంజీవిని అలా వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు!*

ఎన్నికల్లో కూటమి గెలిచింది. సుదీర్ఘకాలం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సేవలను వాడుకోవాలని చంద్రబాబు భావిస్తుండడం విశేషం.

Written By: Dharma, Updated On : October 14, 2024 10:59 am

Chiranjeevi-Chandrababu

Follow us on

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారా? కూటమి సుస్థిరతకు చిరంజీవిని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. ఇటీవల వరద బాధితుల సాయం అందించేందుకు సీఎం చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. చంద్రబాబు ఇంటి బయటకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా చిరంజీవిని అనుసరించి వీడ్కోలు పలికారు. ఎంతో సహృద్భావ వాతావరణంలో వారిద్దరి మధ్య చర్చలు కొనసాగాయి. ఎన్నికల్లో చిరంజీవి కూటమికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. మెగా కుటుంబమంతా కూటమి తరఫున పనిచేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో మెగా ఫార్ములా పనిచేసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్వయంగా చిరంజీవి హాజరయ్యారు. అటు ప్రధాని మోదీ సైతం చిరంజీవితో సన్నిహితంగా గడిపారు ఆ కార్యక్రమంలో. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన చిరంజీవి.. ఆ తరువాత చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, వరద సాయం, పవన్ పనితీరు గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిని సైతం తమతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకోసం కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై చిరంజీవి కొంత పునరాలోచనలో పడినట్లు సమాచారం.

* ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు
తెలుగు సినీ రంగంలో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. అయితే సినిమా రంగంలో రాణించిన చిరంజీవి రాజకీయాల్లో సైతం తన ముద్ర చాటాలని భావించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తనకున్న అభిమాన గణాన్ని ఓట్లుగా మొలుచుకోలేకపోయారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పిఆర్పి 18 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అటు తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. చిరంజీవి సైతం రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం జనసేనతో పాటు కూటమికి మద్దతు ప్రకటించారు చిరంజీవి.

* ఆ క్రేజ్ ఉపయోగించుకోవాలని
చిరంజీవి క్రేజ్ అంతా కాదు. అందుకే ప్రధాని మోదీ లాంటి వ్యక్తి చిరంజీవి వద్దకు వెళ్లి మరి తీసుకొచ్చి ఆయనతో పాటు అభివాదం చేయించారంటే.. చిరంజీవి మేనియో అర్థం అవుతుంది. అందుకే చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి టూరిజం శాఖను నిర్వర్తించారు. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చిరంజీవిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అదే సమయంలో చిరంజీవికి హోదా పరంగా పూర్తి ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. గతంలో వైసిపి హయాంలో చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నాడు సీఎంగా ఉన్న జగన్ ను కలిశారు. చిరంజీవికి అన్ని రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకు చిరంజీవి ఒప్పుకుంటారో? లేదో? చూడాలి.