Vishaka MLC Election : బొత్సతో చంద్రబాబు డీల్.. మధ్యలో కాంగ్రెస్.. జగన్ ఏం చేస్తారో?

ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయస్థాయిలో ఎన్డీఏ వైపు టిడిపి, జనసేన ఉండగా.. వైసిపి డిఫెన్స్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ఏపీలో పాగా వేసేందుకు వైసీపీని దెబ్బ కొట్టాలని చూస్తోంది.

Written By: Dharma, Updated On : August 13, 2024 10:05 am

Vishaka MLC Election

Follow us on

Vishaka MLC Election : అదృష్టం అంటే బొత్సదే. ఎన్నికల్లో ఓడిపోయి రెండు నెలల గడవకముందే పెద్దల సభకు ఎన్నిక కానున్నారు. విశాఖపట్నం ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. అయితే అధికారపక్షం తలచుకుంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని కైవసం చేసుకోవడం చాలా ఈజీ.విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బిగ్ ట్విస్ట్. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరమైనట్లు తెలుస్తోంది. హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ఈరోజు తుది గడువు. టిడిపి అభ్యర్థి రంగంలో ఉంటారా? ఉండరా? అన్నది తెలియాల్సి ఉంది. టిడిపి అనుకూల మీడియాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికకు ఆ పార్టీ దూరం అని ప్రత్యేక కథనం వచ్చింది. స్థానిక సంస్థల్లో 60 శాతానికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండడంతో.. ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్ అని టిడిపి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందటే భారీ మెజారిటీతో కూటమి గెలిచింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ని తప్పనిసరిగా గెలవాలన్న పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు అంచనా వేశారు. పోటీ పెట్టడానికి ముందుకు రానట్లు తెలుస్తోంది. ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. అందుకే చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీనికి తోడు చాలా మంది టిడిపి నేతలు పోటీ పెట్టకపోవడమే బెటర్ అని సూచించినట్లు తెలుస్తోంది.

* ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా
ఉమ్మడి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలిపించుకుంటామని ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే అంత రిస్క్ తీసుకుని పోటీ చేయాల్సిన పనిలేదని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు మదిలో ఏదో వ్యూహం ఉంది. అది ఏంటబ్బా అని చర్చ జరుగుతోంది. రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనే సరికి.. సహజంగానే లోకల్ లీడర్ కు అవకాశం ఇవ్వాలి. కానీ వెంటనే జగన్ బొత్సను లైన్ లోకి తెచ్చారు. ఆయనకు ఇష్టం లేకపోయినా పోటీకి పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా టిడిపి కూటమి పోటీ పెట్టడం లేదని తెలుస్తోంది. బొత్స ఎమ్మెల్సీ కావడం లాంఛనమేనని సమాచారం. కేవలం బొత్స ను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు పోటీ పెట్టించలేదా? లేకుంటే టీడీపీ కూటమికి బలం లేదనా? ఇప్పుడు దీనిపైనే రకరకాల చర్చ నడుస్తోంది.

* ఏకగ్రీవం వెనుక భారీ వ్యూహం
ఎన్నికల అనంతరం బొత్స టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే దానిని ఖండించలేదు ఆయన. వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే బొత్సను ఏకగ్రీవంగా చేయడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ శాసనసభకు రారు. శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా ఇటీవల లేళ్ల అప్పిరెడ్డిని ఎంపిక చేశారు. ఆయనది రౌడీ నేపథ్యం. దీంతో ఆ పదవి బొత్స తప్పకుండా కోరుతారు. అదే జరిగితే వైసీపీపై బొత్స పట్టు సాధిస్తారు.

* పార్టీని చీల్చడానికేనా
మరోవైపు ఇంకో ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం కావాలని చూస్తోంది. ఇప్పటికే బొత్సను ఆశ్రయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక్కరు వస్తే చాలదు. వైసీపీని అడ్డగోలుగా చీల్చి.. బయటకు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బలపడేది. అందుకు రాజకీయ ప్రాతినిధ్యం తప్పనిసరి. అందుకే బొత్సకు చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ ఎలా అడుగులు వేస్తారు అన్నది చూడాలి.