CM Chandhrababu : ఐదేళ్ల తర్వాత మళ్లీ గెలవడం కష్టమే..చంద్రబాబుకే నమ్మకం లేదా? అలా పరిపాలిస్తున్నారా?

ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం కుదరని పని. ఈ విషయం చంద్రబాబుతో పాటు జగన్ కు తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 2019లో అధికారంలోకి.. రెండోసారి కోసం పెద్ద యుద్ధమే చేశారు. కానీ అధికారంలోకి రాలేకపోయారు.

Written By: Dharma, Updated On : August 5, 2024 6:29 pm
Follow us on

CM Chandhrababu : నవ్యాంధ్రప్రదేశ్ లో వింత పరిస్థితి ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం గా చంద్రబాబు ఎన్నికయ్యారు. విభజనతో అనుభవజ్ఞుడైన ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని ఏపీ ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు.అయితే ఐదేళ్లలో ప్రజల అంచనాలను అందుకోలేకపోయారు చంద్రబాబు. దీంతో వన్ చాన్స్ అన్న జగన్ వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపారు.2019 ఎన్నికల్లో జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారు.కానీ గత ఐదేళ్లుగా వైఫల్య విధానాలతో ముందుకెళ్లిన జగన్ కు.. ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజలు తిరుగులేని ఓటమిని కట్టబెట్టారు. తిరిగి చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారు.అయితే రాష్ట్ర విభజనతో దాయాది రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం రెండుసార్లు కేసీఆర్ కు ఛాన్స్ ఇచ్చారు అక్కడ ప్రజలు. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఇక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను మారుస్తూ వచ్చారు.అయితే ఈ కారణంగానే ఇక్కడ పాలన సాగించేందుకు ప్రభుత్వాలు భయపడే స్థితికి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు చంద్రబాబు భయం కూడా అదే.ప్రతి ఐదు సంవత్సరాలకు ఏపీ ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తారని ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కకున్నా.. చంద్రబాబులో మాత్రం జగన్ భయం ఇంకా వీడడం లేదు. ఈరోజు అమరావతిలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తేనే.. మరో ఐదేళ్లలో ప్రజలు తమను ఓటేస్తారని.. అందుకే బాధ్యతతో పని చేయాలని ఆదేశించారు. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడే చంద్రబాబులో భయం ప్రారంభమైందా? అంటూ సోషల్ మీడియాలో వైసిపి ట్రోల్ చేయడం ప్రారంభించింది.

*:హామీలు ఇవ్వాల్సిందే
ఏపీలో గెలుపు అంటే సంక్షేమ పథకాల హామీలు తప్పనిసరిగా ఇవ్వాలి. 2019లోనవరత్నాలతో ప్రజల ముందుకు వెళ్లారు జగన్. అధికారంలోకి వస్తే అమలు చేసి చూపిస్తానని చెప్పారు. దీంతో ప్రజలు ఆదరించారు. అంతులేని మెజారిటీతో అధికారం అప్పగించారు. జగన్ సైతం రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేసి చూపించారు. కానీ ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకున్నారు. అభివృద్ధి లేకపోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. దీనికి ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు తోడు కావడంతో.. ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించారు. ఎంతలా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా..

* సూపర్ సిక్స్ పథకాలు
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు భావించారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అదే సమయంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీలు ఇచ్చారు. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడిప్పుడే మాట మార్చుతున్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని.. ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని.. పథకాలు అమలు చేయడం చాలా కష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది వైసిపికి అస్త్రంగా మారింది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

* కలెక్టర్లకు హితబోధ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అధికారులను మార్చింది. దాదాపు అన్ని జిల్లాల్లో సొంత టీం తయారు చేసుకుంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఐదేళ్లలో మరోసారి అధికారంలోకి రావాలంటే చాలా బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్లకు హితబోధ చేశారు చంద్రబాబు. అయితే అప్పుడే చంద్రబాబు తాతకు అధికారంలోకి రారని తెలిసిపోయిందని.. ముందుగానే చేతులెత్తేసారని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేయడం ప్రారంభించింది. దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజెన్లు.