Putta Mahesh Yadav: తెలంగాణలో నమోదైన డ్రగ్స్ కేసు పై స్పందించారు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్( MP Putta Mahesh Yadav). ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు పుట్టా మహేష్ యాదవ్. నిన్ననే ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై డ్రగ్స్ కేసు విషయంలో రాజకీయ కుట్ర కోణం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై వచ్చిన ఆయన ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
* రోజంతా హైడ్రామా..
నిన్న రోజంతా హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమిషం నిడివిగల ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. మీడియాతో పాటు సోషల్ మీడియాలో( social media) వచ్చే కథనాలను నమ్మవద్దని కోరారు. “ఏలూరు ప్రజలతోపాటు ఏపీ ప్రజలకు నా నమస్కారం. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు. మీకు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడున్న వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్నారు. శనివారం వీలు దొరకడంతో డిన్నర్ కోసం వెళ్లాను. ఆ డిన్నర్ లో నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీ అందరికీ మరోసారి చెబుతున్న. ఏలూరు ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పుడూ తప్పు చేయను. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దు. నేను ఎల్లప్పుడూ నిజమే చెప్తాను. అబద్దాలు చెప్పను. ధన్యవాదాలు” అంటూ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
* షోకాజ్ నోటీసులు
మరోవైపు ఈ వ్యవహారంపై టిడిపి హై కమాండ్ ( TDP high command ) దృష్టి పెట్టింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తీరుపై టిడిపి అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఆదేశించారు. నేతలు చేసే తప్పులతో పార్టీకి నష్టం జరగనివ్వమని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో మహేష్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది టిడిపి నాయకత్వం.. మత్తు పదార్థాలు తీసుకున్నట్టుగా మీపై వచ్చిన ఆరోపణలను, మీడియా కథనాలను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నివేదిక వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మహేష్ను టిడిపి హై కమాండ్ ఆదేశించింది. ఐదు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.