Chandrababu-Lingamaneni House : చంద్రబాబు మోస్ట్ సీనియర్ లీడర్. కానీ అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మునుపటిలా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆయనలో మరీ చాదస్తం పెరిగిపోతోంది. లింగమనేని గెస్ట్ హౌస్ విషయాన్నే తీసుకుందాం. దానిని తొలుత ప్రభుత్వం అటాచ్ చేసింది. ఇప్పుడు ఏసీబీ కోర్టు సైతం జప్తునకు ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణమని తేల్చే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఇక్కడ చంద్రబాబు చతురత ప్రదర్శించారు. తాను అద్దెకు ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అద్దె లావాదేవీలు ఏవీ జరగలేదని ఏసీబీ చెబుతోంది. కానీ చంద్రబాబుతో పాటు టీడీపీ అదే పనిగా వాదనకు దిగుతోంది. లింగమనేని గెస్ట్ హౌస్ ను ప్రజా సమస్యగా పరిగణిస్తోంది.
కృష్ణా నది వరద నీటిని అడ్డగించే కరకట్టల ప్రాంతంలో నిర్మాణమే నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి నిర్మాణాలపై చంద్రబాబు విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అటువంటిది లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉండడం చంద్రబాబు చేసిన తప్పిదం. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనం మాదిరిగా వాడుకున్నారు. అధికారం పోయేటప్పటికి అద్దె భవనంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎల్లో మీడియా సైతం కన్ఫ్యూజ్ అయ్యింది. ప్రభుత్వం జప్తు చేసినప్పుడు చంద్రబాబు నివాసంగా చెప్పి.. ఏసీబీ కోర్టు జప్తు చేసినప్పుడు మాత్రం లింగమనేని గెస్ట్ హౌస్ అని రాసుకొచ్చింది.
అయితే ఇప్పటివరకూ జరిగిపోయింది అని వదిలేయవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం లింగమనేనికి అన్యాయం జరిగిపోయిందంటూ గోల పెడుతున్నారు. అటు టీడీపీ నాయకులు సైతం అదే వాదనకు దిగుతున్నారు. ఎల్లో మీడియా కథనాలు గురించి చెప్పనక్కర్లేదు. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణం కోసం చంద్రబాబు పోరాటం ఏమిటి? ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం ఆరాటం ఏమిటి? సగటు ఏపీ పౌరుడికి తొలుస్తున్న మాట ఇది. క్విడ్ ప్రోతో పొందినది కనుకే చంద్రబాబు అంతలా బాధపడుతున్నారని వైసీపీ ప్రచారం చేసే అవకాశమున్నా టీడీపీ వెనక్కి తగ్గడం లేదు. అటు చంద్రబాబు సైతం తనకు ఎక్కడా ఇల్లు దొరకనట్టు.. తనకు అంత ఆస్తిపాస్తులే లేవన్నట్టు లింగమనేని గెస్ట్ హౌస్ కోసం పాకులాడుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.