Chandrababu: కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుపై కీలక బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. మొన్ననే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన సంగతి తెలిసిందే.. వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చట్టం బిల్లు కూడా వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆ బిల్లు సైతం వీగిపోయే అవకాశం ఉండడంతో వెనక్కి తగ్గింది. అయితే అన్ని పార్టీలకు నియోజకవర్గాల పెంపు అనేది అవసరమే. ప్రధానంగా ఏపీలో నియోజకవర్గాల పెంపుతో కూటమికి మరింత అదనపు బలం చేకూరే అవకాశం ఉంది. కానీ జాతీయస్థాయిలో విపక్షాలు వ్యతిరేకించడంతో ఈ బిల్లుకు బ్రేక్ పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తరుణంలో.. పునర్విభజన బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపేలా.. చంద్రబాబుకు ఆ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. విపక్షాలన్నింటినీ కూడాదీసి ఆ బిల్లుకు మోక్షం కల్పించాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది.
* దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అప్పటి తమిళనాడు సీఎం స్టాలిన్ గట్టిగానే వ్యతిరేకించారు. కేరళ సీఎం గా ఉన్న పినరాయి విజయన్ సైతం వ్యతిరేకించారు. కర్ణాటకలో ఎలాగు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. ప్రధానంగా పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది ఒక వాదన. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయని.. దీంతో రాజకీయ ఆధిపత్యం ఉత్తరాది రాష్ట్రాల చేతికి వెళ్లిపోతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల వాదన.
ఒప్పించే పనిలో చంద్రబాబు..
అయితే ఎట్టి పరిస్థితుల్లో 2029 సార్వత్రిక ఎన్నికలకు.. నియోజకవర్గాల పెంపు అనేది చేయాలని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలంగా భావిస్తోంది. కానీ విపక్షాలన్నీ ఏకం అవ్వడంతో ఏం చేయాలో కేంద్ర పెద్దలకు పాలు పోవడం లేదు. ఇటువంటి తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన చంద్రబాబును ప్రయోగిస్తున్నారట కేంద్ర పెద్దలు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుగా చంద్రబాబు ఇప్పటికే కీలక నేతలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగానే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉంటుందని.. ఎవరికి ఎటువంటి అన్యాయము జరగదని చంద్రబాబు వారిని ఒప్పిస్తున్నట్లు సమాచారం. ఈ చర్చల ప్రక్రియ కొలిక్కి వచ్చాక పునర్విభజన బిల్లును మరోసారి పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జాతీయస్థాయిలో ఇప్పుడు చంద్రబాబు అవసరాలు పెరగడం విశేషం.