Chandrababu: కేంద్ర పెద్దలు గొప్ప ఆశతో ఉన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్నారు. అయితే గతంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టగా విపక్షాలన్నీ కలిపి ఓడించాయి. ఈ బిల్లులు పాస్ కావాలంటే మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం. అయితే లోక్ సభలో అంత మెజారిటీ లేదు ఎన్డీఏకు. అందుకే ఆ బిల్లు వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే ఇప్పటివరకు బిజెపి పెద్దల పొలిటికల్ వ్యూహాలు ఫలించాయి. కానీ ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అందుకే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
* ఎన్డీఏ వైపు డిఎంకె..
తమిళనాడులో డీఎంకేకు ఏకపక్షంగా లోక్సభ ఎంపీల బలం ఉంది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ డిఎంకె ఓడిపోయింది. టీవీకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అయితే దశాబ్దాల పొత్తును వదులుకొని కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్ బై చెప్పింది. టీవీకే గూటికి చేరింది. అయితే కాంగ్రెస్ చేసిన పనికి ఆగ్రహంగా ఉంది డిఎంకె. వెన్నుపోటుగా అభివర్ణిస్తోంది. అందుకే బిజెపి విషయంలో స్టాలిన్ కు ఉన్న అభిప్రాయం మారుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్డీఏ గూటికి డీఎంకే చేరుతుంది అనేది ఒక అంచనా. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోట బద్దలవుతోంది. అక్కడ 20 మంది వరకు లోక్ సభ సభ్యులు బిజెపి వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 29 మంది ఎంపీలు టీఎంసీ కి ఉండగా.. అందులో 20 మంది వస్తే.. ఆ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థ బిజెపిలో విలీనం అవుతుంది. మరోవైపు అక్కడ రాజ్యసభ సభ్యులు సైతం ఒకేసారి బిజెపి గూటికి వస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఆ రెండు బిల్లుల ను సమన్వయం చేసుకునే బాధ్యతలను ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర పెద్దలు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది.
* అభ్యంతరాలు రాకుండా..
ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల వాదన. ఇప్పటికే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడుకు చెందిన చిదంబరం మధ్య గట్టిగానే వాదనలు నడిచాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ స్థానాలను 50 శాతానికి పెంచుతూ.. అన్ని రాష్ట్రాలకు ఒకే మాదిరిగా ఈ నియోజకవర్గాల పెంపు ఉంటుంది అనేది కేంద్రం స్పష్టం చేసే అవకాశం ఉంది. పైగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన స్టాలిన్, రేవంత్ రెడ్డి వంటి వారిని ఒప్పించే బాధ్యతను చంద్రబాబుకు కేంద్ర పెద్దలు కట్టబెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే నెలలోనే ఈ రెండు బిల్లులు మరోసారి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆ సమయానికి ఈ బిల్లులకు పూర్తిస్థాయిలో మద్దతును చంద్రబాబు కూడగట్టాలని కేంద్ర పెద్దలు బాధ్యత అప్పగించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
