Nara Lokesh: లోకేష్ కు చంద్రబాబు కీలక టాస్క్.. చుట్టేస్తున్నారుగా!

మొన్నటి వరకు లోకేష్ ఫెయిల్యూర్ నేత. ఇప్పుడు మాత్రం సక్సెస్ ఫుల్ లీడర్. కానీ ఇది అంత తేలిగ్గా రాలేదు. ఎన్నో రకాల అవమానాలు అధిగమిస్తూ ఈ స్థాయికి ఎదిగారు లోకేష్.

Written By: Dharma, Updated On : October 21, 2024 9:04 am

Nara Lokesh

Follow us on

Nara Lokesh: టిడిపి యువ నేత, మంత్రి నారా లోకేష్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కేంద్ర పెద్దలతో సైతం సమన్వయం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. 40 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. కేంద్ర మంత్రితో సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగాయని లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే ప్రధానంగా రాజకీయ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు హర్యానాలో పర్యటించిన సంగతి తెలిసిందే. బిజెపి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల సమావేశంలో సైతం పాల్గొన్నారు. జమిలీ ఎన్నికలకు సైతం మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన టిడిపి శాసనసభ పక్ష సమావేశంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు పార్టీలతో పొత్తు ఉంటుందని.. అందుకు అనుగుణంగా నడుచుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. రెండు పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యత మీదేనంటూ సూచించారు. చంద్రబాబు తరచు కేంద్ర పెద్దలను ప్రశంసిస్తున్నారు. ఇటువంటి తరుణంలో లోకేష్ సైతం కేంద్ర పెద్దలను కలిసి చర్చలు జరపడం విశేషం.

* నామినేటెడ్ బాధ్యత
రాష్ట్రంలో నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీపదవులను భర్తీ చేయాల్సి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సైతం పెండింగ్లో ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే నామినేటెడ్ పదవుల బాధ్యతను లోకేష్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలతో ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం. మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై కేంద్ర పెద్దల సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

* అప్పట్లో కూడా అలానే
గతంలో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో సైతం లోకేష్ ఢిల్లీలో పావులు కదిపారు. మూడు పార్టీల మధ్య పొత్తుకు అదే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అప్పటివరకు లోకేష్ విషయంలో అనేక రకాల అభ్యంతరాలు ఉండేవి. కానీ తండ్రి అక్రమ అరెస్టు విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరు అప్పట్లో ఆకట్టుకుంది. మరోవైపు ప్రత్యర్థులు ఎన్నో రకాల ఆరోపణలు చేసినా.. వాటన్నింటినీ అధిగమించి లోకేష్ తానేంటో నిరూపించుకున్నారు. తనపై వచ్చిన విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర పెద్దలతో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తానికి అయితే మూడు పార్టీల మధ్య సమన్వయం, పొత్తు కొనసాగడంలో గేమ్ చేంజర్ గా మారారు లోకేష్.