Chandrababu
Chandrababu: జనసేన విషయంలో చంద్రబాబు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీకి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక క్యాబినెట్ లోనే కాదు.. భవిష్యత్తులో పదవుల పంపకాల్లో కూడా ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. క్యాబినెట్లో మూడు మంత్రి పదవులు కేటాయించారు. పవన్ కు డిప్యూటీ సీఎం హోదా కట్టబెడుతూ ఆయన కోరుకున్న కీలక నాలుగు శాఖలను అప్పగించారు. సినిమాటోగ్రఫీ శాఖను ఆ పార్టీకి చెందిన కందుల దుర్గేష్ కు కేటాయించారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ స్పీకర్ తో పాటు అసెంబ్లీ విప్ పదవులను సైతం కేటాయించేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకదానిని జనసేనకు కేటాయించేందుకు నిర్ణయించారు.
ఎమ్మెల్సీ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి సి. రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.అయితే ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లను కూటమి ఏకపక్షంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఎన్నిక సైతం లాంఛనమే. దీంతో ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కుతాయి అన్నది చర్చగా మారింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం జనసేనకు ఒక సీటు కేటాయించడానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు.
అయితే తొలుత ఎమ్మెల్సీగా పిఠాపురానికి చెందిన వర్మకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. పవన్ కోసం సీటు త్యాగం చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేస్తారని కూడా టాక్ నడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం మళ్లీ రామచంద్రయ్య పేరు వినిపిస్తోంది. మరో ఎమ్మెల్సీ స్థానం జనసేనకు దాదాపు కేటాయించినట్లు సమాచారం. పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. హరిప్రసాద్ వివాదరహితుడు. జర్నలిస్టుగా పనిచేశారు. ఈనాడు తో పాటు దాదాపు టాప్ మీడియాలో పనిచేసిన అనుభవం ఆయనది. పవన్ జనసేన ఏర్పాటు చేసినప్పుడు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఆయన సేవలను పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు కూడా. మొన్నటి ఎన్నికల్లో జనసేన టికెట్ ను హరిప్రసాద్ ఆశించారు. వివిధ సమీకరణలో భాగంగా పవన్ ఆయనకు చాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.