Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏదో చేసేటట్టే ఉన్నాడే!

Chandrababu మరోవైపు ఇటీవల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సాగనంపడానికి కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి ఏయే నేత వ్యతిరేకంగా పనిచేశారు వివరాలు తీసుకున్నారు.

Written By: NARESH, Updated On : June 18, 2024 1:27 pm

CM Chandrababu

Follow us on

Chandrababu : తెలుగుదేశం పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టునున్నారు చంద్రబాబు.ఉభయ రాష్ట్రాల అధ్యక్షుల నుంచి.. గ్రామస్థాయి కార్యవర్గం వరకు కొత్తవారిని నియమించనున్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. తెలంగాణకు సైతం అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఏపీలో అధికారంలోకి రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధినేత.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శ ఉంది. దాని నుంచి అధిగమించేందుకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు వారాల్లో ఇప్పుడు ఉన్న కార్యవర్గాలను పూర్తిగా రద్దు చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, గ్రామ, అర్బన్, నగర, డివిజన్ అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దు అవుతాయి. అయితే ఈసారి పార్టీలో యువ రక్తం ఎక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆరుపదులు దాటిన వారిని పక్కన పెట్టనున్నారు. అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నారు. 25 పార్లమెంట్ స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని అధ్యక్షులను నియమించనున్నారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను టిడిపి 16 చోట్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ గట్టి నాయకుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇటీవల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సాగనంపడానికి కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి ఏయే నేత వ్యతిరేకంగా పనిచేశారు వివరాలు తీసుకున్నారు. టికెట్లు దక్కలేదని, ఎలాగైనా పార్టీ అభ్యర్థులను ఓడించాలని చాలాచోట్ల సీనియర్లు ప్రయత్నించారు. అటువంటి వారి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. దాదాపు అటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా టిడిపి 144 స్థానాల్లో పోటీ చేసింది. 135 చొట్ల విజయం సాధించింది. 9చోట్ల ఓటమి తప్పలేదు.అయితే ఆ తొమ్మిది నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఎవరెవరు సహకరించారు? ఎవరెవరు సహకరించలేదు? అన్న వివరాలను ఆరా తీసే పనిలో పడింది హై కమాండ్. మరో మూడు వారాల్లో టిడిపి నాయకత్వం పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయనుండడం విశేషం.