Botsa Satyanarayana: చీపురుపల్లిని వదిలి భీమిలిపై పడ్డ బొత్స.. కారణం అదే?

గంటా శ్రీనివాసరావును చివరి నిమిషంలో టిడిపి టికెట్ దక్కించుకున్నారు. తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆగ్రహంగా ఉంది.

Written By: Dharma, Updated On : May 3, 2024 2:19 pm

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: విశాఖ పార్లమెంట్ స్థానంపై మంత్రి బొత్స ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అక్కడ ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.కానీ పరిస్థితి ఏమంత బాగా లేకపోవడంతో మంత్రి బొత్స స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, గాజువాక, భీమిలి, ఎస్.కోట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో భీమిలి నియోజకవర్గం లో గంటా శ్రీనివాసరావు టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి చేరికలు భారీగా ఉన్నాయి. అక్కడ టిడిపిని ఓడించడం కానీ.. మెజారిటీని తగ్గించడం కానీ.. చేస్తేనే బొత్స ఝాన్సీలక్ష్మి విజయావకాశాలు మెరుగుపడతాయి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సంకేతాలు వస్తుండడంతో బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు.

అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావును చివరి నిమిషంలో టిడిపి టికెట్ దక్కించుకున్నారు. తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో ఒక్కొక్కరు టిడిపిలో చేరుతున్నారు. ఇప్పటికే 9000 నుంచి పదివేల మంది వరకు వైసీపీ శ్రేణులు టిడిపిలోకి జంప్ చేశారు. మరి కొంతమంది యాక్టివ్ నాయకులు టిడిపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ భీమిలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వైసీపీ నేతలు టిడిపిలో చేరకుండా ఆపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వారి భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నారు. భీమిలి ఎంపీపీ దంతులూరి వెంకట శివ సూర్యనారాయణ రాజు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన బొత్స.. ఏకంగా సీఎంతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మెత్తబడ్డారు. పార్టీ మారడం లేదని ప్రకటించారు. అయితే చాలామంది నాయకులు వైసీపీలో ఉన్నా మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. అటువంటి వారి మనసు మార్చేందుకు బొత్స చేయని ప్రయత్నం అంటూ లేదు. తాను పోటీ చేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గాన్ని మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించి.. బొత్స పూర్తి దృష్టంతా భీమిలిపై పెట్టారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ వైసిపి అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు కాదు అన్న రేంజిలో బొత్స దంపతులు వ్యవహరిస్తున్నారు. అయినా సరే టిడిపిలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే భీమిలి జడ్పిటిసి సభ్యుడు గాడు వెంకటప్పడు, వి.ఎం.ఆర్.డి.ఏ మాజీ చైర్ పర్సన్ అక్కరామని నిర్మల, ఆమె భర్త వెంకట్రావు తో సహా సర్పంచులు, ఎంపీటీసీలు భారీగా టిడిపిలో చేరారు. అయితే ఒక్క భీమిలి నియోజకవర్గంలో మెజారిటీని కట్టడి చేస్తేనే విశాఖ లోక్సభ స్థానంలో బొత్స ఝాన్సీ లక్ష్మీ గట్టెక్కేది. అందుకే పాపం ఆ దంపతులు భీమిలిలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు.