Bojjala Sudheer Reddy: ముల్లును ముల్లుతోనే తీయాలి. కొన్ని సందర్భాలలో ముల్లు అవసరం లేకుండానే ఆ పని చేయవచ్చు. కాకపోతే దానికి చాకచక్యం కావాలి. లౌక్యం అంతకంటే కావాలి. ఈ ఎమ్మెల్యేలో అవి చాలా ఉన్నాయి. అందువల్లే పీకల్లోతు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. విమర్శలను చవిచూస్తున్నప్పటికీ ఆయన తల వంచలేదు. అంతేకాదు, ఎవరైతే తనను విమర్శిస్తున్నారో.. వారికే బలంగా సమాధానం చెప్పారు. చివరికి ట్రెండ్ సెట్టర్ అయ్యారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. 2024 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా కోట వినూత పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. చివరికి సుధీర్ రెడ్డి తన చాకచక్యాన్ని ప్రదర్శించి సీటు దక్కించుకున్నారు. జనసేన నాయకులతో సత్సంబంధాలు కొనసాగించి ఎన్నికల్లో తన విజయానికి బాటలు వేసుకున్నారు. సుధీర్ రెడ్డి డాషింగ్ పొలిటిషన్. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.
ఆ మధ్య కోటా వినూత డ్రైవర్ శ్రీనివాసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెన్నైలోని ఓ చెరువు ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. పోలీసుల లోతుగా విచారిస్తే అతని హత్యతో కోటా వినూత, ఆమె భర్త శ్రీనివాసులకు సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసింది. దీంతో పోలీసులు వినుత, భర్త చంద్రబాబును అరెస్ట్ చేశారు. వినుత జైలు నుంచి విడుదలైంది.. కానీ చంద్రబాబు ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. వినుత విడుదలైన తర్వాత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.. అతని వల్ల ఇదంతా జరిగిందని.. తమ రాజకీయ ఎదుగుదల చూడలేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వినుత ఆరోపణలు చేసిన తర్వాత టిడిపి అధిష్టానం కూడా సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. శ్రీనివాసులు హత్యకు సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా టిడిపి అధిష్టానం సుధీర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. టిడిపి అధిష్టానం ముందు హాజరైన సుధీర్ రెడ్డి ఇటువంటి వివరణ ఇచ్చారో ఇప్పటికీ తెలియదు. కాకపోతే తన మీద వస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు బలమైన సమాధానం చెప్పే విధంగా సుధీర్ రెడ్డి వ్యవహరించారు. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
సుధీర్ రెడ్డి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ నేపద్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున భూమిని ఇస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గం పరిధిలోని కుంటిపూడి ప్రాంతానికి చెందిన జస్మిత 598, శ్రీకాళహస్తికి చెందిన సాయి పూజిత 594, తొండమనాడు ప్రాంతానికి చెందిన మోహిత్ శరణ్ 591 మార్కులు సాధించిన నేపథ్యంలో.. వారికి సుధీర్ రెడ్డి ఈ భూములను అందిస్తారు. ఇప్పటికే సుధీర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలోకి ఆ ముగ్గురు విద్యార్థులను ఆహ్వానించి సన్మానించారు. వారికి ఆత్మీయ విందు కూడా ఇచ్చారు.
నారా లోకేష్ ఏపీ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలపేతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన పది ఫలితాలలో ఏపీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఆ ఫలితాలను నారా లోకేష్ గొప్పగా ప్రకటించుకున్నారు. అదే కాదు ప్రభుత్వ విద్యార్థులు సాధించిన ఘనతను ప్రకటనల రూపంలో ప్రచురించారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను నారా లోకేష్ ఈ సందర్భంగా ఆ ప్రకటనలో ప్రస్తావించారు. అంతేకాదు ఆ ప్రకటనలో ఎక్కడా కూడా తన ఫోటో.. తన తండ్రి ఫోటో లేకుండా చూసుకున్నారు. నారా లోకేష్ ఇటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సుధీర్ రెడ్డి.. పది విద్యార్థులకు మూడు సెంట్లు చొప్పున భూమి ఇస్తానని చెప్పడం నిజంగా గొప్ప విషయం. దీంతో సుధీర్ రెడ్డి తన మీద వస్తున్న ఆరోపణలకు ఈ నిర్ణయం ద్వారా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.