Amith Shah : ఏపీలో బీజేపీ లెక్క అదే.. అమిత్ షా తేల్చేశారుగా

బిజెపి పొత్తు తప్పనిసరిగా కావాలని అనుకుంటే గనుక.. చంద్రబాబుకు వేరే గతిలేదు. అలాగని ఆయనకు పెద్ద నష్టం కూడా లేదు. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చి ఉంటారని.. అందుకే అమిత్ షా అలా ప్రకటించి ఉంటారన్న టాక్ అయితే ప్రారంభమైంది.

Written By: Dharma, Updated On : June 12, 2023 8:39 am
Follow us on

Amith Shah : ఏపీలో అమిత్ షా పర్యటన ఎన్నో చిక్కుముడులను విప్పుతోంది. కొత్తస్నేహాలకు సంకేతాలిస్తోంది. ఏ మాత్రం పాజిటివిటీ లేని ఏపీపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నాలుగేళ్ల పాటు పట్టించుకోకుండా ఎన్నికల ముంగిట వాలుతుండడం కూడా చర్చగా మారుతోంది. ఏదో ఒక ప్రయోజనం ఆశించే అగ్రనేతలు ఏపీకి క్యూకట్టారన్న టాక్ ప్రారంభమైంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ, షా ద్వయం గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే అంత ఈజీ అయ్యేలా లేదు. అందుకే ఏ రాష్ట్రంలో చిన్న అవకాశమున్నా వదలకూడదని డిసైడయ్యారు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను గ్రహించి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సాధారణంగా బీజేపీ ఫోకస్ ఎప్పుడు లోక్ సభ స్థానాలపైనే ఉంటుంది. పార్లమెంట్ స్థానాల గెలుపుపైనే ఎక్కువగా దృష్టిపెడుతోంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఒకేఒక ఎమ్మెల్యే స్థానం దక్కింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొందింది. తమకు బలం లేని చోట అసెంబ్లీ ఎన్నికలపై అస్సలు ఫోకస్ పెట్టదు. అయితే ఇప్పుడు ఏపీ విషయంలో అటువంటి స్ట్రాటజీతో ముందుకెళుతోంది.ఏపీ రాజకీయాలను గమనిస్తే కూడా అలాంటి అభిప్రాయం కలుగుతోంది. ఏపీలో మెజార్టీ లోక్ సభ స్థానాలపై గురిపెట్టినట్టు తెలుస్తోంది.

ఏపీలో బీజేపీ అగ్రనేత రెండు రోజుల పర్యటనకు వచ్చారు. విశాఖ రైల్వేగ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మోదీ తొమ్మిదేళ్లలో సాగించిన విజయాలను ప్రచారం చేయడం లక్ష్యంగా ఈ సభలు జరుగుతున్నాయి. పనిలో పనిగా.. జగన్ సర్కారు మీద కూడా అమిత్ షా విమర్శలు చేశారు.
రాష్ట్రంలో బిజెపి 20 ఎంపీస్థానాలను గెలవడం టార్గెట్ గా పెట్టుకోవాలని షా దిశానిర్దేశం చేశారు. ఏపీలో వారి పార్టీకి ఏమాత్రం బలం లేదనే సంగతి వారందరికీ తెలుసు. కానీ 25 సీట్లున్న రాష్ట్రంలో 20 కంటె ఎక్కువ గెలవాలనే లక్ష్యాన్ని ఎలా అనగలిగారు అనేది ఆశ్చర్యం. అక్కడే పొత్తుల గురించిన అనుమానాలు పుడుతున్నాయి. తెలుగుదేశం ఇప్పటికే బిజెపితో పొత్తుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

టీడీపీ, జనసేనతో బీజేపీ కలవాలని పవన్ బలంగా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయి వచ్చారు. వీటిని సమన్వయం చేసుకుంటే.. ఒకవేళ పొత్తులు కుదిరే అవకాశం ఉంటే బిజెపి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు కావాలని డిమాండ్ చేస్తుందనే వాదన వినిపిస్తోంది. 20 సీట్లు అనేది కొంచెం అతిశయంగా అనిపించినప్పటికీ.. కనీసం పది ఎంపీ సీట్లు ఇవ్వాలనే డిమాండ్ తో బిజెపి పొత్తుల చర్చలు జరపవచ్చునని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో అంతగా పట్టింపు ఉండదని అనుకుంటున్నారు.బిజెపి పొత్తు తప్పనిసరిగా కావాలని అనుకుంటే గనుక.. చంద్రబాబుకు వేరే గతిలేదు. అలాగని ఆయనకు పెద్ద నష్టం కూడా లేదు. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చి ఉంటారని.. అందుకే అమిత్ షా అలా ప్రకటించి ఉంటారన్న టాక్ అయితే ప్రారంభమైంది.