Modi Cabinet Expansion 2026: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. 20న పర్యటన ముగించుకొని రానున్నారు. ఏ క్షణంలోనైనా విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. 2029 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేసుకొని మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారని కూడా సమాచారం. అయితే ఏపీ నుంచి బిజెపి ఎంపీ ఒకరికి పదవి ఖాయమని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రచారం ఉంది.
* ఇప్పటికే ఒకరు..
ప్రస్తుతం బిజెపి నుంచి కేంద్ర మంత్రివర్గంలో నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బిజెపి నుంచి ఒకరికి ఇస్తే అది సీఎం రమేష్ కెనని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరారు సీఎం రమేష్. 2019లో తెలుగుదేశం ఓటమి ఎదురుకావడంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా బిజెపిలోకి వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపితో టిడిపి పొత్తు వెనుక సీఎం రమేష్ కృషి ఉంది. పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తప్పకుండా కేంద్రమంత్రివర్గంలో సీఎం రమేష్ కు స్థానం ఉంటుందన్న అంచనాలు కూడా అప్పుడు వచ్చాయి. కానీ వివిధ సమీకరణలో భాగంగా భూపతిరాజు శ్రీనివాస వర్మకు అప్పట్లో అవకాశం వచ్చింది.
* ఏపీ లో బలం పెంచుకోవాలని..
ప్రస్తుతం ఏపీలో బిజెపి బలం పెంచుకోవాలని చూస్తోంది. మూడు పార్టీల పొత్తు కొనసాగుతూనే ఎవరికివారు బలం పెంచుకోవాలన్నది ఒక వ్యూహం అన్నట్లు సమాచారం. అందులో భాగంగా సీఎం రమేష్ కు కేంద్రమంత్రిగా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది అయితే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలన్న టాక్ కూడా ఉంది. ఈ లెక్కన సీఎం రమేష్ కు ఆ అవకాశం లేదు. కానీ కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో.. ఆపై ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో సీఎం రమేష్ కు మంత్రిగా అవకాశం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.