Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ ల వ్యవహారాలు వంటి వాటిలోనే వైసీపీ నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కేసులు నడిచేవి. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు వ్యక్తిగత వైఖరి కారణంగా కేసులకు గురవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరారు వైసీపీ సీనియర్ నేత, టిటిడి మాజీ అధ్యక్షుడు భూమున కరుణాకర్ రెడ్డి. ఏకంగా నదిలోని భూమిని కలుపుకొని కబ్జా చేశారు. అడ్డంగా బుక్ కావడంతో దానిని రాజకీయ కక్ష సాధింపు అని వర్ణిస్తున్నారు.
* అనవసరంగా అరెస్టు వరకు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. ఆయన కుమారుడు బైక్ డ్రైవింగ్ కారణంగా ఒక గొర్రెల కాపరి మృతి చెందారు. బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన గొర్రెల కాపరిని అలానే విడిచిపెట్టి.. తన కుమారుడి స్థానంలో వేరే వ్యక్తిని చూపించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. పోలీస్ విచారణలో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఆయన అరెస్ట్ సైతం జరిగిపోయింది. తమ్మినేని సీతారాం గురించి చెప్పనవసరం లేదు. బతికున్న భూ యజమాని చనిపోయినట్టు చూపి.. ఆయన వారసుల పేరుతో నకిలీ మనుషులు, నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసి.. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని తన కుమారుడు పేరుతో రాయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమ్మినేని ఫ్యామిలీ అక్రమ పర్వాన్ని బయటపెట్టారు. అరెస్టు భయంతో తమ్మినేని ఫ్యామిలీ ప్రస్తుతం పరారీలో ఉంది.
* నది భూమి ఆక్రమణ..
ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన ఏకంగా స్వర్ణముఖి నది భూమిని ఆక్రమించేశారు. ఇప్పుడు అధికారులకు ఫిర్యాదులు రావడంతో పరిశీలించి ఆక్రమణ అని తేల్చారు. ఏకంగా ఫెన్సింగ్ వేయగా దానిని తొలగించి ప్రభుత్వ భూమిగా నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఇన్ని రోజులు కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. కానీ అటువంటి నేత తనకు ఉన్న అధికార బలంతో ఏకంగా నది భూమిని ఆక్రమించుకోవడం వెలుగులోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వంపై ఫ్యాక్షన్ తరహాలో ముద్ర వేస్తున్నారు. అప్పట్లో ఫ్యాక్షన్ నాయకులు ప్రత్యర్థుల భూములను నాశనం చేసిన మాదిరిగా.. కూటమి ప్రభుత్వం తన ఆస్తులను ధ్వంసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే అది తన భూమి అని.. నిబంధనల ప్రకారమే ఆ భూమి తన చెప్పు చేతల్లో ఉంది అని చూపించలేకపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే అప్పలరాజు మాదిరిగా అరెస్టుల వరకు తెచ్చుకుంటున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోంది.



