Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభానికి కూత వేటు దూరంలో నిలిచింది. వచ్చే నెలలో ప్రారంభోత్సవం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రైవేటు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను జూలై 5 నుంచి ప్రారంభించనున్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేక ప్రకటన కూడా చేశాయి. ప్రస్తుతం చూస్తుంటే మాత్రం జూలైలో విమానాశ్రయం ప్రారంభం గ్యారెంటీ అని తేలిపోయింది.
* పౌర విమానయాన శాఖ మంత్రిగా కృషి..
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంలో.. ఉత్తరాంధ్రకు చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఉంది. గత రెండేళ్లుగా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను పరుగెత్తించారు. అందుకే పనులు చాలా వేగంగా కొనసాగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంతోనే చాలా వేగంగా పనులు జరిగాయి. ఇక్కడ విమాన రాకపోకలకు సంబంధించి ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. చివరిగా పెండింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.
* శాఖ మార్పు అనివార్యమా?
అయితే ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఆయన ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి కేంద్రంలో. రామ్మోహన్ నాయుడుకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ఆయన శాఖ మార్పు ఉంటుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది.
* విస్తరణకు కసరత్తు..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు నరేంద్ర మోడీ కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నెల 20న ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 18 తో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణలో కొత్తవారికి చోటుతోపాటు పాత వారి శాఖల కేటాయింపు ఉంటుందన్న టాక్ ఉంది. పౌర విమానయాన శాఖ నుంచి తప్పించి.. రామ్మోహన్ నాయుడుకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. అదే జరిగితే పౌర విమానయాన శాఖ మంత్రిగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో.. ప్రధాని తరువాత అదే స్థాయిలో గౌరవం దక్కాల్సిన రామ్మోహన్ నాయుడుకు ఆ ఛాన్స్ లేనట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో..
