Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.. స్వతహాగా విద్యార్థి నాయకుడిగా ఉండేవారు ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు అదే విద్యార్థి లోకం ఆందోళనల ఫలితంగా పదవికి దూరమయ్యారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తదుపరి కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎవరు అనే చర్చ బలంగా నడుస్తోంది. అయితే ఈసారి సమర్ధులకు అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. క్యాబినెట్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి ఈసారి అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆమె క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ఆమె వైపు మోది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
* ఇరకాటంలో కేంద్రం..
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. పేపర్ లీకేజీ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయడంతో పాటు పారదర్శకంగా ఇకనుంచి వ్యవహరిస్తామని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు జనతా కాక్రోచ్ ఉద్యమంతో దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యమం పక్కదారి పట్టి ఛాన్స్ అధికంగా ఉంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అందుకే విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించింది. అయితే తదుపరిగా ఈ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న వినిపించింది. అయితే ఆ అవకాశం ఏపీకి చెందిన మహిళ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
* సీనియర్ పార్లమెంటేరియన్ గా..
మూడోసారి ఎంపీ అయ్యారు దగ్గుబాటి పురందేశ్వరి. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో విభేదించి.. భర్త వెంకటేశ్వరరావు తో కలిసి పురందేశ్వరి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి చేపట్టారు. సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా ఆమె రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని భావించారు. కానీ వివిధ సమీకరణలో దక్కలేదు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో ఆమెకు చాన్స్ దక్కుతుందని ప్రచారం జరిగింది. ఇంతవరకు మంత్రివర్గాన్ని విస్తరించలేదు మోడీ. ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పురందేశ్వరికి ఆ శాఖ ఇస్తారని తెలుస్తోంది. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇస్తారా? లేకుంటే ఇప్పుడే ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.





