Andhra Pradesh Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాల గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం సన్నాహాలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం సైతం కసరత్తు ముమ్మరం చేసింది. విద్యార్థుల వార్షిక పరీక్షలు, బీసీ రిజర్వేషన్లు ఖరారు వంటి కీలక అంశాల కారణంగా.. వేసవిలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. పంచాయితీ సర్పంచుల పదవీకాలం గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. మున్సిపల్ పాలకవర్గాల గడువు మార్చి 17తో ముగియనుంది. ముందుగా ప్రత్యేక అధికారులను నియమించి ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన.
* ప్రత్యేక కమిషన్ ఏర్పాటు..
అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయి. ముందుగా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ లెక్కన చూస్తే ఏప్రిల్ చివరి వారంతో పాటు మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తరువాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. చివరిగా ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేయాలని ఒక అంచనాతో ఉంది.
* విద్యార్థుల పరీక్షలు ముగిశాక..
సాధారణంగా మార్చి, ఏప్రిల్ లో వార్షిక పరీక్షలు ఉంటాయి. అయితే ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు ముందుగానే ప్రారంభం అయ్యాయి. పదో తరగతి పరీక్షలు మార్చిలో కొనసాగనున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కమిటీ నివేదిక కూడా మార్చి నెలాఖరుకు రానుంది. వీటన్నింటినీ చూస్తుంటే మాత్రం ఏప్రిల్ లో ఎన్నికలకు సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. సాధారణంగా పోలింగ్ కేంద్రాలు అనేవి పాఠశాలలను వినియోగిస్తూ వచ్చారు. అందుకే విద్యార్థుల పరీక్షలు పూర్తయితే కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించలేరు. రాజీవ్ రంజాన్ కమిషన్ నివేదిక తర్వాత వార్డుల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.