Ration card holders : రేషన్ లబ్ధిదారులకు పండగే.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ప్రస్తుతం నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. కూరగాయల ధరల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటువంటి సమయంలో పండగలు సమీపిస్తున్నాయి. సామాన్యుడు ధరలు చూసి బెంబేలెత్తుతున్నాడు. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు తీపి కబురు అందించింది.

Written By: Dharma, Updated On : October 1, 2024 5:36 pm

Ration card holders

Follow us on

Ration card holders : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల బియ్యంతో పాటు కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది. చక్కెరతో పాటు కందిపప్పును కూడా అందించనున్నారు. దసరా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రేషన్ డిపోలను చౌక ధరల దుకాణాలుగా పరిగణించేవారు. గతంలో బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, గోధుమపిండి, వంటనూనె అందించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితం అయింది. పండగ కానుకలు సైతం నిలిచిపోయాయి. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ కు పండగ సరుకులు అందించేవారు. ప్రత్యేక కిట్లు పంపిణీ చేసేవారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండగ కానుకలు నిలిచిపోయాయి. రేషన్ జాబితాలో మిగతా సరుకులను తొలగించి.. కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసేవారు. మధ్యలో కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా రోజులపాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తూ వచ్చింది. అయితే మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండాజాప్యం కూడా చేసింది. దీనిపై విమర్శలు రావడంతో పంపిణీని ప్రారంభించింది. అయితే కేవలం ఒక్క బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితం కావడం పై విమర్శలు వచ్చాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖ ప్రక్షాళన పై ఫోకస్ పెట్టింది. రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

* ఈ నెల నుంచి కందిపప్పు
ఈ నెల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను కూడా అందించనున్నారు. ఇప్పటికే కందిపప్పు నిల్వలు జిల్లాలకు చేరుకున్నాయి. రేషన్ కార్డుకు కిలో కందిపప్పు చొప్పున అందించనున్నారు. దసరాకు ఇది శుభవార్తగా పరిగణిస్తున్నారు ప్రజలు. ఇప్పటికే కానుకల విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలో పండుగ కానుకల పేరిట కిట్లను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందే రేషన్ లో కందిపప్పు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.

* పేదలకు ఉపశమనమే
కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కిలో 150 నుంచి 170 రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం రాయితీపై 67 రూపాయలకే అందించనుంది. చక్కెర అరకిలోను 17 రూపాయలకే విక్రయించనున్నారు. దసరా, దీపావళి పండుగలు ఉండడం, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రభుత్వం కందిపప్పు ఇవ్వాలని ముందుకొచ్చింది. అలాగే కందిపప్పు తో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నలను కూడా రేషన్ తో పాటు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రేషన్ డిపోలను పెంచుతూ ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది.

* పౌరసరఫరాలు ప్రక్షాళన
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ డిపోల ప్రక్షాళన పై ప్రత్యేకంగా దృష్టి సారించింది ప్రభుత్వం. రేషన్ సరుకులు అక్రమాలు, అవకతవకలను గుర్తించింది. కాంట్రాక్టర్లు సరఫరా చేసే కందిపప్పు, పంచదార ప్యాకెట్ల తూకాల్లో తేడాలు ఉన్నట్లు తేల్చింది. అందుకే వాటి పంపిణీ సైతం నిలిపివేసింది. అయితే ఇప్పుడు లోపాలు సవరించి.. సరుకుల విడుదలకు నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో ఈ నెల నుంచి కందిపప్పు.. వచ్చే నెల నుంచి గోధుమపిండితో పాటు ఇతర నిత్యవసర వస్తువులు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.