AP Film Development Corporation: ఏపీ ప్రభుత్వం సినిమా పదవులను ప్రకటించింది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ పేరును ప్రకటించింది. మరో 15 మంది డైరెక్టర్లను సినీ రంగం నుంచి ఎంపిక చేసింది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ ఏపీఎఫ్డిసి పాలకవర్గం ఎంపికలో జాప్యం జరిగింది. మధ్యలో రకరకాల పేర్లు కూడా వినిపించాయి. ఎట్టకేలకు ప్రభుత్వం నియామకాలు చేసింది . అయితే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నం పేరును సూచించారు. అలా సూచించిన సమయంలోనే అది తన అభిప్రాయమని.. ప్రభుత్వానికి కొన్ని రకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయని గుర్తు చేశారు. ఇప్పుడు అలానే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజును ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ఈ నియామకం జరిగింది. ఏపీలో మాత్రం జాప్యం జరిగింది.
* ప్రముఖ నిర్మాత..
ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా నియమితులైన భరత్ భూషణ్ ప్రముఖ నిర్మాత. గాయత్రీ దేవి ఫిలిమ్స్ పేరిట సినిమా పంపిణీ రంగంలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచార కర్తగా తెరవెనుక సేవలు అందించారు. వైస్ చైర్మన్ గా మెహర్ రమేష్ నియమితులు కాగా ఆయన సైతం నందమూరి, మెగా కుటుంబ దర్శకుడు. వీరిద్దరి కాంబోతో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని అంతా భావిస్తున్నారు. భరత్ భూషణ్ కు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు తెలుసు. పైగా చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి ఏపీకి కూడా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. మెహర్ రమేష్ కు సైతం పరిశ్రమలు 24 ఫ్రేమ్స్ పై పూర్తిస్థాయి అవగాహన ఉంది. అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఈ ఇద్దరి నియామకం జరిగింది.
* ఏపీలో సైతం విస్తరించాలి..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తెలంగాణలో మాత్రమే ఉంది. కేవలం అవుట్ డోర్ షూటింగ్లకు మాత్రమే ఏపీ పరిమితం అవుతోంది. చిత్ర పరిశ్రమకు అవసరమైన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. షూటింగ్లకు అనువైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం పర్యాటక ప్రాంతమే కాకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విశాఖకు చిత్ర పరిశ్రమ విస్తరించాలన్న ప్రతిపాదన గత టిడిపి ప్రభుత్వం నుంచి అలానే ఉండిపోయింది. కనీసం ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అయిన ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ఏపీ కేవలం సినిమాను పెంచే రాష్ట్రంగా కాకుండా.. ఉద్యోగ ఉపాధి పెంచే పరిశ్రమ విశాఖలో విస్తరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది.
