Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహిస్తోంది. ప్రారంభోత్సవం నాడు 13వేల మంది గిరిజన కళాకారులతో ధింసా నృత్యం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ పోటీలు నిర్వహిస్తోంది. ఎయిర్పోర్ట్ పై 30 సెకండ్ల రీల్ రూపొందించి పోస్ట్ చేయాలని.. ఈనెల 29 వరకు చేయవచ్చని సూచిస్తోంది. హ్యాష్ టాగ్స్, మరో అకౌంట్ కు ట్యాగ్ చేయాలని సూచిస్తుంది. ఐదు బెస్ట్ రీల్స్ ను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే విమానాశ్రయంపై స్లోగన్ పోటీలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా సోషల్ మీడియా వేదికగా ఈ రీల్స్ పోటీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది దీనిపై.
* ఆగస్టు 1న ప్రారంభం..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవాన్ని ఒక వేడుకల నిర్వహించాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎయిర్పోర్ట్ గురించి ప్రపంచానికి తెలిసేలా 30 సెకండ్ల రీల్స్ పోటీలు నిర్వహించనుంది. సెల్ఫీ రీల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి 30 సెకండ్లు రీల్ ఉండేలా రూపొందించాలని సూచించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి తమ భావాలు, సందేశాలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది ఈ రీల్స్ లో. ఈనెల 29 లోపు ఈ రీల్స్ను వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని సూచించారు. ఈ రీల్ను పోస్ట్ చేయడంతో పాటు తప్పనిసరిగా @ APofficialnews కూ ట్యాగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే # ASR International Airport, # Uttarandhra kalalakurekkalu హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించాలని కూడా చెప్పారు.
* ఐదు ఉత్తమ రీల్స్ ఎంపిక..
అయితే ఈ రీల్స్ లో ఉత్తమమైన వాటిని అధికారులు ఎంపిక చేయనున్నారు. క్రియేటివిటీ, మెసేజ్, ఎఫెక్ట్, ప్రజా దారుణ వంటి అంశాల ఆధారంగా 5 ఉత్తమ రీల్స్ ను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందిస్తారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విమానాశ్రయం పై ఒక స్లోగన్ కు ఆహ్వానించారు విజయనగరం కలెక్టర్. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభావం, ఆశయాలు, ప్రత్యేకతలు వివరించేలా ఒక స్లోగన్ కు ప్లాన్ చేశారు. ఆరు నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రీల్స్ పోటీని ప్రకటించారు.


