AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. ఆయనకే ఈసారి ఛాన్స్!

భారతీయ జనతా పార్టీ ఏపీపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం పై ఫోకస్ చేసింది. అందులో భాగంగా బిజెపి ఏపీ చీఫ్ ను మారుస్తారని ప్రచారం సాగుతోంది.

Written By: Dharma, Updated On : October 21, 2024 8:57 am

AP BJP

Follow us on

AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని మార్చుతారా? ఆమె మార్పు ఖాయమా? అదే జరిగితే ఆమె స్థానంలో ఎవరికి పదవి ఇస్తారు? మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కా? లేకుంటే మరో సీనియర్ కు అప్పగిస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఇంకా బిజెపి అధ్యక్షులను ప్రకటించలేదు. ఎన్నికలకు ముందు నియమించిన వారే కొనసాగుతున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు అధ్యక్షులను మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన పురందేశ్వరికి ఇంకా సమయం ఉంది. అయితే ఆమె పని తీరుపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లడంతో మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆమె భర్త వెంకటేశ్వరరావు సూచనలతో నడుచుకుంటున్నారని.. అది పార్టీకి అంతిమంగా నష్టం చేకూరుస్తోందని హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. మరోవైపు బిజెపి కంటే టిడిపి ప్రయోజనాల కోసమే పురందేశ్వరి ఎక్కువగా పాటుపడుతున్నారని కూడా బిజెపి నేతలు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నడుమ ఏపీ బీజేపీ చీఫ్ ను మార్చడమే ఉత్తమమని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బలమైన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

* కిరణ్ పేరు తెరపైకి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు హై కమాండ్ నిర్ణయించినట్లు కూడా టాక్ నడిచింది. ఆయనకు అప్పగిస్తే బలమైన సామాజిక వర్గం బిజెపి వైపు వస్తుందని అంచనా కూడా వేశారు. అయితే బిజెపి చీఫ్ కంటే రాజ్యసభ పదవిని కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కిరణ్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఇలా చేరిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించడం బిజెపి ఆనవాయితీకి విరుద్ధం. బిజెపిలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారిని కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

* ఆర్ఎస్ఎస్ నేతకు చాన్స్
ప్రస్తుతం ఏపీలో బిజెపి ప్రాతినిధ్యం పెరిగింది. దీనిని మరింత బలోపేతం చేసుకోవాలని హై కమాండ్ భావిస్తోంది. అందుకే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేత కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీకి విజయం చేకూర్చిన రామ్ మాధవ్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ సైతం ఆయన పేరును సూచించినట్లు సమాచారం. పైగా ఏపీలో పొత్తుకు కూడా ఆయనే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది అన్నది హై కమాండ్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే పురందేశ్వరి మార్పు మాత్రం ఖాయం. మరి ఆమె స్థానంలో ఎవరు వస్తారు అన్నది వెయిట్ అండ్ సీ.