Bhogapuram International Airport: ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు ప్రారంభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.. దాదాపు పనులన్నీ పూర్తి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. విజయవంతంగా పూర్తి చేసింది పౌర విమానయాన శాఖ. అన్ని కుదిరితే జూలై నుంచి అక్కడ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేటాయించింది కేంద్రం. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణం ప్రారంభం అయింది. ఇప్పుడు అదే టిడిపి ప్రభుత్వంలో విమానాశ్రయం ప్రారంభం కానుండడం విశేషం.
* దేశంలోనే అతి పెద్దది..
దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేటాయించారు. ఉత్తరాంధ్రలో నిర్మించాలన్నది అప్పటి ప్రభుత్వ ఆలోచన. విశాఖలో ఉండే విమానాశ్రయం పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. చాలడం లేదు. దీంతో అన్ని హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పూసపాటి అశోక్ గజపతిరాజు ఉండేవారు. ఆయన విన్నపం మేరకు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అప్పటి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూ సమీకరణతో పాటు పనులు ప్రారంభం అయ్యాయి అప్పట్లో. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనుల్లో జాప్యం జరిగింది. అయితే 2024లో ఎన్డీఏ అధికారంలోకి రావడం.. టిడిపి కీలక భాగస్వామి కావడం.. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను తీసుకోవడం వంటి కారణాలతో.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. మొన్ననే ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. దాదాపు పెండింగ్ పనులన్నీ పూర్తయ్యాయి.
* ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం..
అయితే జూన్ లో విమానాశ్రయం ప్రారంభం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జూలై 5/ 8/10 తేదీల్లో విమానాశ్రయ ప్రారంభం జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం పంపింది. ఈ మూడో తేదీల్లో ఒకదానిని ఖరారు చేయాలని కోరింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం జూలై 5 తేదీని ఖరారు చేసింది. మరోవైపు దీనిని ధ్రువీకరిస్తూ సింగపూర్ ఎయిర్లైన్స్ సూట్ సంస్థ తమ విమాన రాకపోకలను భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి జూలై 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమ ఏజెంట్లకు కూడా సమాచారం ఇచ్చింది. అయితే ఒక్కో విమానయాన సంస్థ తమ కార్యకలాపాలను భోగాపురం నుంచి ప్రారంభించేందుకు వీలుగా ప్రకటనలు చేస్తుండడం విశేషం. విమానాశ్రయ ప్రారంభానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
