Andhra Pradesh Left Politics: తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష భావజాలం కాస్తా పక్కదారి పట్టినట్టు కనిపిస్తోంది. మొన్నటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కూడా ఇది స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో వామపక్షాల నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. రాజకీయ ప్రేరేపితం అన్నట్టు వారి ప్రవర్తన ఉంది. కూటమి వచ్చిన తర్వాత వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలకు కొంత స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవం. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం నోరు తెరవ లేకపోయారు వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు. అంతలా ఉక్కు పాదం మోపారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఇస్తే.. మరోలా మాట్లాడుతున్నారు. లేనిపోని వివాదాలు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను ఎంతలా చూశారో అందరికీ తెలిసిన విషయమే.. ఇప్పుడు వారిద్దరి పార్టీలకు మైలేజ్ వచ్చేందుకు ఇదే వామపక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రయత్నిస్తుండటం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* సమస్యల పరిష్కార వారధి..
వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు అంటే ముందుగా గుర్తొచ్చేది సమస్యల పరిష్కారం. కార్మికులతో పాటు ఉద్యోగులు వామపక్షాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే వారు పోరాటం చేస్తే ఏదో ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందన్న ఆశ. అయితే ఇప్పుడు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ ప్రేరేపితం అనే చట్రంలో చిక్కుకుంటున్నాయి. లేనిపోని వివాదాలకు అవకాశం కల్పిస్తున్నాయి. సమస్యలకు పరిష్కారం మరిచి.. మరింత జఠిలం చేస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి.. బాధితుల పరామర్శకు వెళ్లిన.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్ పై నిలదీసినంత పని చేశారు. ఆయన సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. చనిపోయింది మీ కుటుంబాలు వారు కాదు కదా? బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ.. విరుచుకు పడే దాకా పరిస్థితి వచ్చింది.
* వైసీపీకి సహకారం..
ఇప్పుడు అనవసరంగా విశాఖకు చెందిన వామపక్షాల నేతలు ట్రోల్ అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. నాడు జగన్ సర్కార్ నోరు తెరవలేదు. కనీసం ప్రైవేటీకరణను నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బిజెపితో టిడిపి, జనసేనకు పొత్తు కుదిరిందో.. నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం యూటర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ ఆగింది. 13 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ సమకూరింది. వైసీపీ హయాంలో కొందరు వామపక్షాల నేతలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు వైసీపీ నేతలతో. కానీ ఇప్పుడు మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ఉక్కు శాఖ పర్యవేక్షిస్తుంది. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ ట్రాప్ లో పడి వామపక్షాల నేతలు సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి… తామే సమస్యలను సృష్టిస్తున్నారు. వారికి ఉన్న మంచి పేరును చెడగొట్టుకుంటున్నారు
