Vangaveeti Asha Kiran Political Entry: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యాలయం తో పాటు రాజకీయ అరంగేట్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపైనే పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి మోహన్ రంగా కుమార్తె. గత కొద్దిరోజులుగా రంగా రాధా మిత్రమండలి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆశాకిరణ్. గతంలో ఆ మిత్రమండలి యాక్టివ్ గా పని చేసేది. తదనంతర పరిణామాలతో ఆ యాక్టివ్ తగ్గింది. ఈ క్రమంలో ఆశా కిరణ్ మిత్రమండలి బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ప్రచారం నడిచింది. అయితే అన్నీ తెలియజేసి రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు విజయవాడలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభం తో పాటు పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
* ప్రత్యేక స్థానం..
తెలుగు రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మోహన్ రంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి విజయవాడలో అండగా నిలిచేవారు మోహన్ రంగా. ఈ క్రమంలోనే 1983 లో కాంగ్రెస్ తరపున విజయవాడ తూర్పు నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. 1988లో ఓ దీక్ష శిబిరంలో ఉండగా దారుణ హత్యకు గురయ్యారు. అటు తరువాత ఆయన భార్య రెండుసార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రంగా కుమారుడు రాధా. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నడుమ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ పదవి కానీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
* సెంట్రల్ నియోజకవర్గం పై ఫోకస్..
రంగా -రాధా మిత్రమండలి బలోపేతానికి రంగంలోకి దిగిన కుమార్తె ఆశాకిరణ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన సైతం టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడ గాంధీ నగర్ లో కార్యాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. అయితే ఇప్పటివరకు వంగవీటి కుటుంబం తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తూ వచ్చింది. కానీ ఆశా కిరణ్ అందుకు విరుద్ధంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోదరుడు టిడిపిలో ఉన్నారు. మరోవైపు ఆశాకిరణ్ జనసేన నుంచి కానీ.. వైసీపీ తరఫున నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.
