Andhra Pradesh Government Schools: ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలు వృద్ధి సాధించాయి. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన స్థానాలను పొందాయి. కార్పొరేట్ తో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలను సాధించడం విశేషం. సాధారణంగా ఫలితాలు వచ్చిన మరుసటి మీడియా ఫోకస్ అంతా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ప్రకటనలపై ఉండేది. కానీ ఈసారి మాత్రం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో కూడిన ఫోటోలు పత్రికల్లో కనిపించాయి. భారీ ప్రకటనల రూపంలో ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ స్కూళ్లలో 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక ప్రకటన అనుకుంటే పొరపడినట్టే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే లక్షలాదిమంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా.
* మంత్రి నారా లోకేష్ చొరవ..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్నారు నారా లోకేష్. ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కేవలం ప్రైవేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన క్వాలిటీ విద్యను.. ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ తరగతులు, నాణ్యమైన విద్యా బోధన, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచగలిగారు నారా లోకేష్. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా మంచి వాతావరణాన్ని సృష్టించగలిగారు. అందుకు అనుగుణంగా పాఠశాలలను తీర్చిదిద్దగలిగారు.
* పెరిగిన ఉత్తీర్ణత శాతం..
వాస్తవానికి గత ఏడాదికంటే పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది కంటే 4.15% ఉత్తీర్ణత నమోదు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 5,26,954 మంది ఉత్తీర్ణత సాధించారు. 83.69 శాతం మంది ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే టాప్ గా నిలిచారు. 2161 పాఠశాలలో సతశాతం ఉత్తీర్ణత నమోదయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం అందర్నీ ఆకట్టుకుంది. పాఠశాల విద్యాశాఖలో తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది.