Ananthapur : పగోడు అంతే..ప్రతిపక్షంలో ఉంటే బహిష్కరణ.. సీమలో రాజకీయం ఇంతే

రాయలసీమలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ఎపిసోడ్ నడుస్తోంది. ప్రత్యర్థులు ఎదురైతే ఘర్షణలకు దిగడం కామన్.ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే ఇటువంటి సీన్లు అధికం.

Written By: Dharma, Updated On : August 26, 2024 3:48 pm

Thadipathri Politics

Follow us on

Ananthapur : ఏపీలో అత్యంత వివాదాస్పద నియోజకవర్గాల్లో తాడిపత్రి ఒకటి. ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవు. ఈసారి అసెంబ్లీ పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు జరిగాయి.పోలింగ్ అనంతరం కూడా కొనసాగాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య హోరా హోరి ఆధిపత్య పోరు నడిచింది. గత ఐదేళ్లుగా ఇది కొనసాగుతూ వచ్చింది.జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉండగా.. ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండేవారు.అయితే ఈ ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసిపి ఓడిపోయింది. కౌంటింగ్ అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గాన్ని విడిచిపెట్టారు. మొన్న ఆమధ్య వ్యక్తిగత పని నిమిత్తం తాడిపత్రి నియోజకవర్గం లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్పీ అనుమతితో తాను నియోజకవర్గంలో అడుగు పెట్టానని.. అయినా సరే టిడిపి శ్రేణులు తనను అడ్డుకునే ప్రయత్నం చేశాయని పెద్దారెడ్డి చెప్పుకొచ్చారు. తన సోదరుడిని హత్య చేసింది జెసి ప్రభాకర్ రెడ్డి అని ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి తాడిపత్రి రాజకీయాలు వేడెక్కాయి. పోలీసులు సముదాయించి పంపించడంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.

* నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి వీలులేదు
తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పై బహిష్కరణ వేటు వేశారు జిల్లా ఎస్పీ. తాము అనుమతి ఇచ్చేవరకు నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. పెద్దారెడ్డి ఇంటికి నోటీసులు పంపించారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డి పై అనాధికార వేటు కొనసాగుతోంది. ఆయనను జిల్లాలోకి కూడా పోలీసులు అనుమతించడం లేదు. అయితే ఏదో ఒక కారణం చెప్పి పెద్దారెడ్డి మాత్రం నియోజకవర్గంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

* డిజిపి నివేదికలతోనే
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి డిజిపి నివేదికలు సమర్పించారు. తాడిపత్రిలో కీలక నాయకులు ఉంటే ఉద్రిక్తతలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా పెద్దారెడ్డికి వ్యతిరేకంగా నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై బహిష్కరణ వేటు పడింది. జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నేరుగా ఇంటికే నోటీసులు పంపారు.దీనిపై పెద్దారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

* ఐదేళ్లుగా కేసులతో ఉక్కిరిబిక్కిరి
గత ఐదేళ్లుగా జేసీ కుటుంబం కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ ఇటీవల గుర్తు చేశారు. జెసి కుటుంబం పై ఎన్ని కేసులు పెట్టాలో అంతలా పెట్టారని.. చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తమ విషయంలో జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జెసి ప్రభాకర్ రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొన్న ఆ మధ్యన జగన్ తల్లి విజయమ్మను కూడా ప్రభాకర్ రెడ్డి కలిశారు. జెసి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు, ఇటీవల జరిగిన పరిణామాలు, డీజీపీ నివేదికలతో పెద్దారెడ్డి పై ఏకంగా బహిష్కరణ వేటు పడింది.