Amaravati high speed rail: ఇప్పుడు అంతటా అమరావతి( Amravati capital ) పేరు మార్మోగిపోతుంది. గత కొద్దిరోజులుగా అమరావతి విషయంలో గందరగోళానికి చెక్ చెబుతూ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. పార్లమెంట్లో ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రానుంది. మరోవైపు అమరావతికి అన్నింటా ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అందులో భాగంగా రెండు హై స్పీడ్ రైల్ క్యారిడార్లను అమరావతికి కనెక్ట్ చేసింది. ఇప్పటికే ఏపీ మీదుగా మూడు కారిడార్లు వెళ్తుండగా.. అందులో రెండింటిని అమరావతి తో లింక్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమరావతి మహా నగరానికి ఇది ఒక మైలురాయి.
ఇప్పటికే సానుకూలత..
హైదరాబాద్, చెన్నై కారిడార్ను( Hyderabad to Chennai corridor) ఇప్పటికే అమరావతి తో కనెక్ట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా మైసూర్, చెన్నై కారిడార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు, చెన్నై హై స్పీడ్ రైల్ క్యారిడార్ను చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో దానిని సైతం అమరావతికి లింక్ చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- హైదరాబాద్ నుంచి చెన్నై కారిడార్ కు సంబంధించి అమరావతి మీదుగా గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట మీదుగా శ్రీ సిటీ, చెన్నైకి ఏర్పాటు కానుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారు పాల్యం, బెంగళూరు, మాండ్యా మీదుగా మైసూర్ కు రెండో కారిడార్ అందుబాటులోకి వస్తుంది.
- కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. తమిళనాడుతో పాటు కర్ణాటక కు ఉపయోగపడేలా ఈ హై స్పీడ్ కారిడార్లను ప్లాన్ చేసింది. వీటిలో హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు – చెన్నై కారిడార్లు ఉన్నాయి. అయితే ఈ కారిడార్లలో తిరుపతిని చేర్చలేదు. అయితే చంద్రబాబు బెంగళూరు టు చెన్నై కారిడార్ను చిత్తూరు తిరుపతి మీదుగా నాయుడుపేటకు కనెక్ట్ చేయాలని కోరారు.
- ఈ హై స్పీడ్ కారిడార్లకు సంబంధించి వచ్చే ఏడాది నాటికి డిపిఆర్ రూపొందించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ చెన్నై అలైన్మెంట్ ను రైల్వే శాఖ ఏపీలో అమరావతి మీదుగా ప్రతిపాదించింది.
- హైదరాబాద్- బెంగళూరు అలైన్మెంట్లో రాయలసీమ ప్రాంతం మీదుగా వెళ్తోంది. బెంగళూరు- చెన్నై మధ్య ప్లాన్ చేసింది. అయితే వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే కేంద్రం రైల్వే శాఖ పరంగా అమరావతికి ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం శుభపరిణామం.