Jagan And Amaravati Farmers: అమరావతి రైతులకు అండగా నిలుస్తానని ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ప్రకటన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఐదేళ్ల తన పదవీకాలంలో ఎన్నడూ అమరావతి రైతుల ముఖం చూడలేదు. కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తనకు అమరావతి రాజధాని విషయంలో వేరే ఆలోచన ఉందని.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నానని కనీసం చెప్పలేకపోయారు వారితో. మొన్నటికి మొన్న మావిగన్ అని ప్రతిపాదన చేశారు. అమరావతికి ప్రత్యామ్నాయం ఇది అంటూ సలహా ఇచ్చారు. ఇప్పుడు అమరావతి రైతులను తన వద్దకు పిలిపించుకుని వారికి న్యాయ సహాయం అందిస్తామని చెబుతున్నారు. అయితే ఇక్కడే ఒక లాజిక్. భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులకు కాదని.. భూములు ఇవ్వని 27 మంది రైతులను పిలిపించుకొని వారికి న్యాయ సహాయం చేస్తామని చెప్పడం మాత్రం నిజంగా గమనించదగ్గ విషయం. అయితే ఆది నుంచి ఈ 27 మంది రైతులను తన గుప్పెట్లో పెట్టుకుంది వైసిపి. అందుకే ఇప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చినట్లు అర్థమవుతోంది. అలాగని వీరంతా భూములు ఇవ్వరు అనుకోవడం పొరపాటే. తమ వద్ద ఉన్న భూములు ఇచ్చేందుకు సిద్ధం కానీ.. అదనపు పరిహారం కోరుకుంటున్నారు వీరంతా. అందుకే జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్న ఆలోచనతో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో అశోక్ అనే రైతు ఉన్నారు. ఒకవైపు జగన్ ను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. అదే రోజు భూసేకరణలో భాగంగా తనకున్న 1.40 ఎకరాల భూమిని అమరావతికి స్వాధీనం చేస్తూ అధికారులకు అప్పగించారు. అంటే అక్కడి రైతుల భిన్న వైఖరి కూడా అర్థం అవుతుంది.
* రెడ్డి రైతులు ఉన్నారా?
అమరావతిలో ఉన్నది కమ్మ సామాజిక వర్గం వారి అని జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. చివరకు ఆ విషయాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొడాలి నానితో కూడా చెప్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసిన 27 మంది రైతుల్లో.. దాదాపు 25 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. వారంతా కలిసింది వైసీపీ ఇన్చార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలోనే. ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం వారు మాత్రమే అమరావతిలో ఉన్నారని.. వారి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కానీ ఇప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గం వారు సైతం ఉన్నారని అర్థమవుతోంది. కేవలం కమ్మ సామాజిక వర్గం వారి ఉన్నారని చెబుతుండడం అబద్ధం అని తేలిపోయింది. అన్ని కులాల సమాహారం అమరావతి అని స్పష్టం అవుతోంది.
* సీడ్ యాక్సిస్ రోడ్డుకు అడ్డంకి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో తీసుకున్న స్టాండ్ చిన్నపిల్లడిని అడిగిన తెలిసిపోతుంది. అమరావతి పై విషం చిమ్మాలి. రాజకీయ ప్రయోజనం పొందాలి. అంతకుమించి ఏం ఆలోచన లేదు ఆ పార్టీకి. అందుకే వీలైనంతవరకు అమరావతికి అడ్డు చెప్పాలన్నది ఆ పార్టీ ఆలోచన. అమరావతి రాజధాని కి ప్రధానమైన మార్గం సీడ్ యాక్సిస్ రోడ్డు. కానీ ఇంతవరకు దాని నిర్మాణం పూర్తిగా జరగలేదు. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది తాజా సమావేశం ద్వారా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఉండవెల్లి రైతులు. దాదాపు సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భూ సేకరణ జరిగింది. ఒక్క రోడ్డు మాత్రమే కాదు దానికి అనుబంధంగా కొన్ని రకాల నిర్మాణాలు జరగాలి. అందుకు దాదాపు 3,000 ఎకరాల భూమి సమీకరించాలి. కానీ ఉండవెల్లి, పెనుమాక రైతులు అభ్యంతరాలు చెబుతున్నారు. తమ భూమి మంగళగిరి కి దగ్గరగా ఉన్నందున ధర ఎక్కువగా ఉంటుందని.. అమరావతి రైతులకు మించి తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే 33 వేల ఎకరాలకు పైగా భూమి సమీకరించారు. అక్కడి రైతులను కాదని ఇక్కడి రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినా సరే రకరకాల మార్గాల్లో భూ సమీకరణకు సిద్ధపడుతోంది. 33,000 మంది రైతులు తమ భూములను త్యాగం చేశారు. 300 మంది రైతుల అభ్యంతరం చెబితే ఆ ప్రాజెక్టు నిలిచిపోయే అవకాశం లేదు. ప్రజా ప్రయోజనం కోసం అతి కొద్ది మందికి ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందేనని చట్టం చెబుతోంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ రైతులకు తెలుసు. కానీ దీనిని రాజకీయం చేయాలి. రాజకీయ ప్రయోజనం పొందాలి.
* శతాబ్దపు జోక్..
అమరావతికి అండగా జగన్మోహన్ రెడ్డి అంటూ సాక్షి మీడియాలో బ్యానర్ కథనం వచ్చింది. అయితే ఇది ఈ శతాబ్దపు జోక్. ఎందుకంటే అమరావతి రైతులను కనీసం మనుషులుగా కూడా చూసేవారు కాదు జగన్. కేసులతో ఎలా ఉక్కు పాదం మోపారో తెలియనిది కాదు. న్యాయబద్ధంగా వారు చేస్తున్న పోరాటాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసుల మీద కేసులు పెట్టారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మహిళా రైతులను వేశ్యలతో పోల్చారు. ఇలా ఎన్నెన్నో ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఇప్పుడేమో అమరావతి పనులు శరవేగంగా జరుగుతుంటే మావిగన్ అంటూ ప్రతిపాదించారు. అమరావతి రైతులను పిలిపించుకొని.. మీకు న్యాయ సహాయం చేస్తాం.. భూములు ఇవ్వకండి అని చెప్పడం అమరావతిపై ప్రేమ అనాలా? ద్వేషం అనాలా? అనేది జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకే విడిచిపెడదాం.
