Andhra Pradesh legislative Council Chairman Attack: అమరావతికి( Amravati capital) చట్టబద్ధత వేళ గతంలో జరిగిన పరిణామాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా అప్పటి చైర్మన్ షరీఫ్ పై దాడి జరిగింది. వికేంద్రీకరణ బిల్లు అప్పట్లో శాసనసభలో ఆమోదం లభించింది. ఎందుకంటే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది కాబట్టి. అయితే శాసనమండలిలో మాత్రం చర్చ జరగలేదు. మండలి ఆమోదం తెలపలేదు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్న దృష్ట్యా చైర్మన్ షరీఫ్ ఆ బిల్లును తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పట్లోనే ఆయన పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
* బయట పెట్టిన షరీఫ్..
అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం లభించడం పై రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. అందులో భాగంగా షరీఫ్ తనపై జరిగిన దాడి గురించి ప్రస్తావించారు. అప్పట్లో పోడియం చుట్టూ నిల్చున్న ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు తనపై దుర్భాషలాడుతూ దాడి చేశారని గుర్తుకు తెచ్చుకున్నారు. ఓ మంత్రి తన గుండెలపై చేయి వేసి కొట్టారంటూ షరీఫ్ బయట పెట్టడం విశేషం. అప్పట్లో శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు చేసే మీడియా ఛానళ్లలో ఆ దృశ్యాలు ఉంటాయి కూడా.. అప్పట్లో చైర్మన్ షరీఫ్ పై దాడికి సంబంధించి జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ఇప్పుడు దానినే గుర్తు చేశారు షరీఫ్. అయితే అప్పట్లో మంత్రిగా ఉన్న ఒక నేత చేయి చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
* మీడియాలో ప్రసారం..
2020లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. అప్పట్లో మంత్రులుగా ఉన్న కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ చైర్మన్ వైపు దూసుకెళ్లారు. ఈ ఆందోళనలో అప్పట్లో మైకులు విరిగిపోయాయి. చైర్మన్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ షరీఫ్ ఈరోజు తనపై జరిగిన దాడిని ప్రస్తావించారు. కానీ ఎవరి పేరును బయట పెట్టకపోవడం విశేషం. అప్పట్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ నేత అయివుంటారన్న అనుమానం ఉంది.
