Amaravati Capital Bill: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) గురించి ఆ పార్టీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటాయి. అటువంటి సాహస నేత ఉండరని భావిస్తుంటాయి. కాంగ్రెస్ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అంటూ చెబుతుంటాయి. ఒంటరి పోరాటంలో ఆరితేరిన ధీరుడు అని గొప్పగా చెబుతుంటాయి. అందులో చాలా వరకు నిజం ఉంది. అయితే అటువంటి సాహసమే చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం అమరావతి రాజధానిని చట్టబద్ధత చేస్తూ పార్లమెంట్ ఈరోజు ఆమోదం తెలపనుంది. దానిని జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేరు కూడా. ఎందుకంటే కేంద్రంలో బిజెపిని ఎదిరించి ఆయన ఏ పని చేయలేరు. అలాగని పార్లమెంటుకు వచ్చి ఆ బిల్లుకు మద్దతు తెలపలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి ముందు ఒక ఏకైక ఆప్షన్ ఉంది. అమరావతిని బాహటంగా వ్యతిరేకించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 11 మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు లోక్సభ సభ్యులు రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికకు వెళ్తే.. రాజధానిని రెఫరెండంగా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ అంతటి సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తారా అనేది ఒక అనుమానం.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
* పుంజుకునేందుకు అవకాశం
నేరుగా అమరావతి( Amravati capital ) చట్టబద్ధత బిల్లు పార్లమెంటులోకి రావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్నిపరీక్ష. అదే సమయంలో రాజకీయంగా పుంజుకునేందుకు ఇది గొప్ప అవకాశం కూడా. పైగా ఆయన లేవనెత్తిన అంశాల్లో ప్రాంతీయ వాదం ఉంది. మూడు ప్రాంతాలకు పాలనా వికేంద్రీకరణ విస్తరించాలన్నది జగన్మోహన్ రెడ్డి అభిమతం. తన స్నేహితుడు కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అలానే చేశారు. తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా తనకు ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రంతో ప్రత్యక్ష యుద్ధానికి దిగితే మంచి ఫలితం ఉంటుంది. లోలోపల మూడు రాజధానులు అంటూ.. బయటకు మాత్రం తాము అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పడం ఆ పార్టీకి సముచితం కాదు. అందుకే మూడు రాజధానుల కోసం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన చేయాలి.
* ఆ నిర్ణయం తీసుకుంటే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్మ సందేహంలో పడింది. విశాఖపట్నం( Visakhapatnam) రాజధానిగా ఉండాలని పట్టుబట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో పడిపోయిన తన పట్టును కూడా నిలుపుకోవచ్చు. అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని చిన్నచిన్న మాటలు చెప్పడం కాదు.. తమ స్టాండ్ మూడు రాజధానులు అని తేల్చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత కూడా పెరుగుతుంది. అస్పష్ట వైఖరితో రాజకీయంగా డ్యామేజ్ కావడం కంటే.. సాహసంతో కూడుకున్న నిర్ణయంతో సంచలనాలు సృష్టించి.. మరోసారి తన సార్ధక నామం దూకుడును పెంచుకోవాల్సిన అవసరం ఆ పార్టీపై ఉంది. అమరావతి బిల్లుకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి రోడ్డు ఎక్కితే.. రాష్ట్రంలో ఒక రాజకీయ ఉద్యమం పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ సాహసాలతో కూడుకున్నది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉండేది.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఎదురు తిరిగి చూపించారు. ఇప్పుడు అటువంటి వీరత్వం మరోసారి చూపించాల్సిన అవసరం ఉంది.
