AI Impact On Journalism: వచ్చేది అంతంత మాత్రం జీతం. పైగా బండెడు చాకిరి.. సెలవులు ఉండవు.. చెప్పుకునే స్థాయిలో ప్రయోజనాలు ఉండవు.. తప్పదు కాబట్టి చాలామంది ఆ ఫీల్డ్ లో ఉంటారు. నమస్తే లకు అలవాటు పడి.. వేరే పనులు చేయడానికి కూడా ఇష్టపడరు. అలా ఉంటుంది జర్నలిస్ట్ జీవితం. ఫీల్డ్ లెవెల్ జర్నలిస్ట్ పరిస్థితి ఇలా ఉంటే.. డెస్క్ లెవెల్ లో మరింత దారుణంగా ఉంటుంది.. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా పనిచేస్తూనే ఉండాలి.. కొన్ని సందర్భాలలో ఆరోగ్యాలు కూడా సహకరించవు. మేనేజ్మెంట్లు ఉదారత చూపించవు.
అసలే పెనం మీద ఉన్న జర్నలిస్టుల బతుకులు… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పొయ్యిలో పడ్డాయి. చాలావరకు మేనేజ్మెంట్ సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. దీంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇప్పటికే చాలా వరకు సంస్థలు గ్రాఫిక్స్ భాగంలో పని చేస్తున్న వారిని పక్కన పెట్టాయి. పెద్ద అనే పేరున్న ఓ ఛానల్ దాదాపు 60 మంది దాకా ఉద్యోగులను తొలగించేసింది. వీరిలో స్క్రిప్ రైటర్లు.. కంటెంట్ క్రియేటర్లు.. డిజిటల్ విభాగంలో పనిచేసేవారు.. గ్రాఫిక్స్ విభాగంలో పని చేసేవారు ఉన్నారు. ఒక్కో విభాగంలో దాదాపు మూడు నుంచి నలుగురు వరకు ఉద్యోగులను తొలగించింది ఆ ఛానల్.
ఆ చానల్ బాటలో పదవ నెంబర్ సంఖ్య పేరుతో ప్రసారాలు చేపడుతున్న ఛానల్ కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా ఇప్పటికే 30 మంది ఉద్యోగులను తొలగింపు జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. వారిని వచ్చే నెల నుంచి రావద్దని చెప్పినట్టు సమాచారం. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను సెటిల్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని చానల్స్ లో గ్రాఫిక్ విభాగాలలో డిజైనర్లతో అవసరం లేకుండా పోయింది.. స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెంటనే పూర్తవుతోంది.
ఈ నేపథ్యంలోనే మేనేజ్మెంట్లు ఈ అంశాలను కారణాలుగా చూపిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తొలగింపు జాబితాలోని ఉద్యోగుల్లో ఎక్కువ వేతనం.. సీనియర్లే ఉండడం విశేషం. అయితే ఈ రెండు చానల్స్ మాత్రమే కాకుండా.. మిగతా చానల్స్ కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఉద్యోగుల తొలగింపు చేపట్టకుండా.. దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏఐ రాకతో.. ఎలక్ట్రానిక్ మీడియా రంగం మొత్తం కుదుపులకు గురవుతోంది. ఇది ఎక్కడదాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది.

