AB Venkateswara Rao
AB Venkateswara Rao: సాధారణంగా సినిమాల్లో ఒకరోజు పోలీస్ చూస్తాం.. ఒకరోజు సీఎంను చూస్తుంటాం.. ఒకరోజు అధికారిగా వ్యవహరించే వారిని చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం ఒకే ఒక రోజు డిజిపి హోదాలో ఉన్న అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఈరోజు చూస్తున్నాం. గంటల వ్యవధిలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన పై ఉన్న సస్పెన్షన్ వేటు నుంచి విముక్తి కలిగించింది న్యాయస్థానం. దీంతో ఆయనను డీజీపీ హోదాలో నియామక ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.
గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావును వెంటాడింది. ఉద్యోగం లేకుండా చేసింది.సీనియారిటీ హోదాలో ఆయనకు డిజిపి హోదా కట్ట పెట్టాల్సి ఉంది. కానీ ఆయనపై ఎప్పటికప్పుడు సస్పెన్షన్ వేటు వేస్తూ జగన్ గట్టి రివెంజ్ తీర్చుకున్నారు.టిడిపి ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు.ఇంటెలిజెన్స్ ఐజిగా పనిచేసేవారు. ఆ సమయంలోనే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయించడంలో ఏబీ వెంకటేశ్వరరావుది కీలక పాత్ర అన్నది జగన్ కు ఉన్న అనుమానం. టిడిపి హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వారి ఫోన్లను ట్యాప్ చేయించి.. వారిని ప్రలోభపరిచి వైసీపీలో తీసుకెళ్లారన్నది ఒక ఆరోపణ. అందుకు కారణం మాత్రం ఏ బి వెంకటేశ్వరరావు అని జగన్ బలంగా నమ్మారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు పై ఫస్ట్ వేటు పడింది. అతని కుమారుడు విదేశాలతో ఆయుధ వ్యాపారం చేశారని.. ఆయన వెనుక ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారని ప్రభుత్వం అభియోగాలు మోపింది. కానీ ఆ కేసు కోర్టులో నిలవలేదు. దీంతో ప్రభుత్వం పై విమర్శలు చేశారన్న కోణంలో రెండోసారి కేసు నమోదు చేసింది ప్రభుత్వం. అది మొదలు ఆయనపై ఐదు సంవత్సరాల పాటు సస్పెన్షన్ వేటు పడుతూనే ఉంది. అయితే ఆయన జీతభత్యాలు చెల్లించాలంటూ క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే సరిగ్గా ఈరోజు పదవి విరమణ చేయాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆఖరు రోజు డీజీపీగా ఏపీ వెంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కరోజు డిజిపిగా ఏబీ వెంకటేశ్వరరావు రికార్డు సాధించినట్టే.